వలస కార్మికులు రోడ్లపైకి.. లాక్‌డౌన్ అమల్లో అలసత్వం: ఇద్దరు ఐఏఎస్‌లు సస్పెండ్

By Siva KodatiFirst Published Mar 30, 2020, 4:23 PM IST
Highlights

ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. అయితే ఈ స్థితిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఇలాంటి పరిస్ధితికి కారణమైన ఇద్దరు ఐఏఎస్ అధికారును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

భారత్‌లో కరోనా వైరస్‌‌ను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలు అత్యవసరమైతే తప్పించి బయటకు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పోలీసులు పగలు రాత్రి తేడా లేకుండా కాపలా కాస్తూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

అయితే ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికుల పరిస్ధితి లాక్‌డౌన్ కారణంగా అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కార్మికులు, వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్ల మీదకు వచ్చారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: తిండి తిప్పలు లేకుండా 114 కి.మీ నడిచిన గర్భిణీ

దీంతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. అయితే ఈ స్థితిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఇలాంటి పరిస్ధితికి కారణమైన ఇద్దరు ఐఏఎస్ అధికారును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

వీరు లాక్‌డౌన్ కాలంలో ఆంక్షలను అమలు చేయడంతో పాటు ప్రజారోగ్య సంరక్షణలో అలసత్వం ప్రదర్శించినట్లు తేలింది. ఢిల్లీ రవాణా శాఖ అదనపు ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై వేటు  పడగా.. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, సీలంపూర్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట 2005 ప్రకారం ఏర్పాటు చేసిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇచ్చే సూచనలను ఎట్టి పరిస్ధితుల్లో ఉన్నతాధికారులు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ కమిటీకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

మరోవైపు వలస కార్మికుల స్థితిపై  దాఖలైన అత్యవసర వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్.ఐ బాబ్డే మాట్లాడుతూ.. 21 రోజుల పాటు కార్మికులు ఉన్న చోటే ఉండటానికి తగిన పరిస్థితులు, వనరులు లేవని వ్యాఖ్యానించారు.

Also Read:వలస కార్మికులపై అమానుషం: రోడ్డుపై వరుసగా కూర్చోబెట్టి రసాయనాలు స్ప్రే

భయం, ఆందోళన కరోనా వైరస్ కంటే భయంకరమైనవని ఆయన బొబ్డే వ్యాఖ్యానించారు. అదే సమయంలో పిటిషన్‌దారుల వాదనలపై స్పందిస్తూ.. ప్రభుత్వం  ఇప్పటికే వలస కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుందని అన్నారు.

అలాగే వలస కార్మికుల ప్రయాణాన్ని నిలిపివేసేందుకు, సంక్షేమానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును మంగవారం తమకు సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జస్టిస్ బొబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. కేంద్రం నుంచి ప్రస్తుత స్థితిపై నివేదిక వచ్చిన తర్వాత స్పందిస్తామని తెలిపింది. 

click me!