జిల్లాకో కరోనా హాస్పిటల్... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Mar 27, 2020, 4:29 PM IST
Highlights

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపి సర్కార్  కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: ఏపీలో ప్రతి జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కేవలం కరోన ట్రీట్మెంట్ కోసం తీసుకునే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. జిల్లాల వారీగా ఆసుపత్రుల వివరాలు ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.   

శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నాని మీడియాకు వివరించారు. ఏపీ రాష్ట్రంలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా మంత్రి చెప్పారు.విదేశాల నుండి రాష్ట్రంలోకి వచ్చినవారి సంఖ్య 28 వేల మంది ఉన్నారన్నారు.. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ నుండి నివారణ చర్యలు తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి చెప్పారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల కరోనా కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల సౌకర్యం కూడ ఏర్పాటు చేశామన్నారు.

కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న రోగులకు వైద్యం అందించే వైద్య సిబ్బందికి ప్రత్యేకమైన దుస్తులను 4 వేలు అందుబాటులో ఉంచినట్టుగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలోకి అన్ని రకాల సరుకుల రవాణా వాహనాలను అనుమతించినట్టుగా మంత్రి పేర్ని నాని చెప్పారు.ఈ మేరకు సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కూడ ఏపీ రాష్ట్ర అధికారులు మాట్లాడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.ఆక్వా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆక్వా ఎగుమతిదారులతో ఈ నెల 28వ తేదీన సమావేశం ఏర్పాటు చేశామన్నారు మంత్రి. 

కరోనా వైరస్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర స్థాయిలో 10 మంది ఐఎఎస్ అధికారులు, ఐదుగురు మంత్రులతో కమిటి ఏర్పాటు చేసినట్టుగా మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ పోర్స్ తో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొంటామని మంత్రి తెలిపారు.ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సరైంది కాదని భావిస్తున్నామన్నారు 

 

 

click me!