వరుసగా ఐదోసారి మళ్లీ లగ్జరీ కార్ల కింగ్​గా మెర్సిడెజ్​ బెంజ్​

By Sandra Ashok KumarFirst Published Jan 11, 2020, 12:33 PM IST
Highlights

భారతదేశంలో లగ్జరీ కార్ల విక్రయాలు 2019లో భారీగా పడిపోయాయి. అయినా మెర్సిడెజ్ బెంజ్ కారు వరుసగా ఐదో ఏడాది లగ్జరీ కార్ల విక్రయాల్లో లీడర్‌గా నిలిచింది. 

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, బీఎస్-6 ప్రమాణాల అమలు అంశాలు దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్నే చూపింది. జీఎస్టీతోపాటు విడి భాగాల దిగుమతిపై భారీ సుంకం అంశాలు కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను బలహీన పరిచాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్​ బెంజ్​ భారత్​లో మరోసారి సత్తా చాటింది. వరుసగా ఐదో ఏడాది లగ్జరీ కార్ల సెగ్మెంట్​లో మార్కెట్​ లీడర్​గా నిలిచింది.

దేశీయ విపణిలో లగ్జరీ కార్ల సెగ్మెంట్​లో 2019లోనూ మార్కెట్ లీడర్​గా నిలిచినట్లు మెర్సిడేజ్​​ బెంజ్​ ఇండియా ప్రకటించింది. మెర్సిడేజ్ బెంజ్​ ఈ ఘనత సాధించడం వరుసగా ఇది ఐదో సంవత్సరం. 2019లో మెర్సిడెజ్​ బెంజ్​ ఇండియా మొత్తం 13,786 యూనిట్లు విక్రయించింది.

also read మళ్ళీ పడిపోయిన వాహన అమ్మకాలు...కారణం బి‌ఎస్ 6...?

అయితే, మార్కెట్​ లీడర్​గా నిలిచినా 2018తో పోలిస్తే 2019లో మెర్సిడెజ్​ బెంజ్​ కార్ల విక్రయాలు 11.3 శాతం తగ్గాయి. గత ఏడాది డిసెంబర్​ త్రైమాసికంలో బెంజ్​ విక్రయాలు 3.3 శాతం వృద్ధి చెంది 3,781 యూనిట్లకు చేరుకున్నాయి. త్రైమాసిక అమ్మకాల్లో బెంజ్​కు ఇదే అత్యధిక స్థాయి. ఈ ఏడాదీ విక్రయాల్లో వృద్ధి నమోదవుతుందని సంస్థ ధీమా వ్యక్తం చేసింది. ఈ నెల 28న కొత్త జీఎల్​ఈ మోడల్​ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

భారతదేశంలో లగ్జరీ కార్ల సేల్స్‌ 2019లో భారీ పతనం నమోదు చేసుకున్నది. దశాబ్ది క్రితం నాటి సేల్స్‌కు లగ్జరీ కార్ల విక్రయాలు పడిపోయాయి. ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాల ప్రకారం 2018లో 40,340 లగ్జరీ కార్లు అమ్ముడు పోతే, 2019లో 34,500-35,500 లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయని తెలుస్తున్నది. 

బీఎస్-6 ప్రమాణాలు అమలులోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి కార్ల విక్రయాల్లో పెరుగుదల నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 2019 తమకు చాలెంజింగ్ ఇయర్‌గా నిలిచిందని మెర్సిడెజ్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ స్కెవెంక్ చెప్పారు. డీలర్లతో కలిసి కస్టమర్ ఇన్సెంటివ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినా ఫలితం లేకపోయిందన్నారు.

ఫెస్టివ్ సీజన్‌లో సానుకూల ఫలితాలు లభించాయని, మార్కెట్లో సానుకూల సంకేతాలు ఉన్నాయని మెర్సిడెజ్ బెంజ్ సీఈఓ మార్టిన్ స్కెవెంక్ తెలిపారు. 2020లో సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అంతర్జాతీయంగా చూస్తే లగ్జరీ కార్ల విక్రయాలు భారత మార్కెట్లోని కార్ల విక్రయాల్లో 1.2 శాతానికంటే తక్కువే. 

also read ఒక్క నెలలోనే మార్కెట్లోకి 100కి పైగా వాహనాలు... టాటా మోటార్స్

చైనా ఆటోమొబైల్ వాహనాల విక్రయాల్లో లగ్జరీ కార్ల విక్రయాలు 13 శాతంగా ఉంటే, అమెరికాలో 10 శాతంగా నమోదయ్యాయి. వరుసగా ఐదో ఏడాది లగ్జరీ కార్ల విక్రయాల్లో ముందుపీఠిన నిలిచిన మెర్సిడెజ్ బెంజ్ తన ప్రత్యర్థి సంస్థ బీఎండబ్ల్యూ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. 2009-2012 మద్య బీఎండబ్ల్యూ కారు అత్యధిక లగ్జరీ కార్ల విక్రేతగా నిలిచింది. 

2019లో బీఎండబ్ల్యూ కార్ల విక్రయాలు 13.2 శాతం పడిపోయి 9,641 యూనిట్లకు చేరుకున్నాయి. 2018లో బీఎండబ్ల్యూ కార్లు 11,105 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ సేల్స్ వరుసగా మూడో ఏడాది పతనమయ్యాయి. 2018తో పోలిస్తే 2019లో 29 శాతం తగ్గి 4,594 కార్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. 2012-15 మధ్య ఏటా 10 వేల కార్లు విక్రయించిన వోక్స్ వ్యాగన్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. 
 

click me!