కారు కొంటే బహుమతి..ప్రభుత్వం సరికొత్త ఆలోచన...

By Sandra Ashok KumarFirst Published Jun 9, 2020, 2:05 PM IST
Highlights

సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వినియోగ కార్ల స్థానంలో విద్యుత్ కార్ల వినియోగానికి డిమాండ్ పెరుగుతున్నది. విద్యుత్ కార్ల కొనుగోలుదారులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం కూడా విద్యుత్ కారు కొన్నవారికి 6000 పౌండ్ల బహుమతినిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. 
 

లండన్‌: విద్యుత్ వాహనాల వినియోగాన్ని పలు దేశాలు ప్రోత్సహిస్తుండటంతో  బ్రిటన్‌ ఓ ఆకర్షణీయ ప్రతిపాదనతో ముందుకురానున్నది. డీజిల్‌, పెట్రోల్‌ వాహన యజమానులు విద్యుత్  వాహనాల కొనుగోలు కోసం ముందుకు వస్తే వారికి 6000 పౌండ్లు అందించేందుకు బ్రిటన్‌ కసరత్తు చేస్తోంది.

నూతన వాహనాలకు డిమాండ్‌ పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ వంటి రెండు ప్రయోజనాలు నెరవేరేలా ఈ ప్రతిపాదనపై బ్రిటన్‌ యోచిస్తోంది. ఫ్రాన్స్‌, జర్మనీ వంటి పలుదేశాలు ఎలక్ర్టిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్న క్రమంలో బ్రిటన్‌ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

also read బెంట్లే కంపెనీ ఉద్యోగులపై వేటు.. భవిష్యత్తులో ఇంకా ఉంటాయని హెచ్చరికలు..

కరోనా సంక్షోభ సమయంలో ఆటోమొబైల్‌ రంగానికి ఊతం ఇచ్చేందుకు కార్‌ స్క్రాపేజ్‌ స్కీమ్‌ను బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పరిశీలిస్తున్నారని ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. కరోనా లాక్‌డౌన్‌తో కార్ల తయారీదారుల ఉత్పత్తి, సరఫరాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాహనాలకు డిమాండ్‌ సైతం రికార్డు కనిష్టాలకు పడిపోయింది.

కొత్తగా ఎలక్ర్టిక్‌ వాహనాల కొనుగోళ్లకు రాయితీలు అందిస్తే బ్రిటన్‌లో వాహన తయారీ కంపెనీలకు ఊతమిచ్చినట్టు అవుతుందని ఓ ఆంగ్ల దినపత్రిక పేర్కొంది.మరోవైపు ఇండియాలో పాత కార్లను వదిలించుకుని ఎలక్ర్టిక్‌ వాహనాలు, నూతన వాహనాలను కొనుగోలుచేసే వారికి ప్రోత్సాహకంగా కార్‌ స్ర్కాపేజ్‌ పాలసీ తుది మెరుగులు దిద్దుకుంటుంది. 

ఈ ప్రతిపాదన భారత ఆటోమొబైల్‌ పరిశ్రమకు కొత్త ఊపునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ దిశగా నూతన విధానానికి శ్రీకారం చుడతామని ఎంఎస్‌ఎంఈ, ఉపరితల రవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల సానుకూల సంకేతాలు పంపారు.
 

click me!