మనోళ్లు మంచి పనిమంతులు: బెస్ట్ సీఈఓల్లో ముగ్గురు ఎన్నారైలకు చోటు

By Sandra Ashok KumarFirst Published Oct 30, 2019, 11:12 AM IST
Highlights

అంతర్జాతీయంగా అత్యుత్తమ సీఈఓల జాబితాలో ముగ్గురు ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ సమీక్షించే ఈ జాబితాలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, మాస్టర్ కార్డు సీఈఓ అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్లకు చోటు దక్కింది.

న్యూయార్క్‌: ప్రపంచంలో ఉత్తమ పని తీరు ప్రదర్శించిన బెస్ట్ సీఈవోల జాబితాలో ముగ్గురు భారత సంతతి సీఈవోలు చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాదికిగాను హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ (హెచ్‌బీఆర్‌).. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 100 మంది సీఈవోలతో విడుదల చేసిన జాబితాలో ముగ్గురు ఎన్నారైలు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. 

బట్ ఇటీవలి వరకు ప్రపంచ కుబేరుడిగా రాణించిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఈ జాబితాలో వెనుకబడ్డారు. తాజా జాబితాలో అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ ఆరో స్థానంలో నిలువగా, మాస్టర్‌కార్డ్‌ సీఈవో అజయ్‌ బంగా ఏడో స్థానం పొందారు. ఇక మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నారు.

కాగా, ఈ జాబితాలో చోటు సంపాదించిన భారతీయుల్లో డీబీఎస్‌ బ్యాంక్‌ సీఈవో పియూష్‌ గుప్తా (89వ స్థానం) కూడా ఉన్నారు. 2015 నుంచి కేవలం ఆర్థికపరమైన అంశాలతోపాటు పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నట్లు హెచ్‌బీఆర్‌ వెల్లడించింది. 
 

also read రిసెషన్ నిజమే.. కానీ తాత్కాలికం: ముకేశ్‌ అంబానీ

మొత్తంగా అమెరికన్ టెక్నాలజీ సంస్థ ఎన్వీడియా సీఈఓ జెన్ సెన్ హువాంగ్ అగ్రస్థానాన్ని పొందారు. 2014 నుంచి ఏటా అత్యుత్తమ సీఈవోల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌.. ఈసారి ఆ గౌరవం పొందలేకపోయారు. 

పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన అంశాల్లో (ఈఎస్‌జీ) బెజోస్‌ స్కోర్‌ తక్కువగా ఉందని హెచ్‌బీఆర్‌ స్పష్టం చేసింది. కేవలం పనితీరు ఆధారంగా మాత్రమే జెఫ్ బెజోస్ ఈ జాబితాలో 2014 నుంచి తొలి స్థానంలో నిలుస్తూ వచ్చారు.ఈ దఫా మొదటి స్థానంలో అమెరికా టెక్నాలజీ సంస్థ ఎన్‌వీఐడీఐఏ సీఈవో జెన్సన్‌ హంగ్‌ నిలిచారు. 

టాప్‌-100లో ఉన్న ప్రముఖ సీఈవోల్లో నైక్‌ సీఈవో మార్క్‌ పార్కర్‌ (20వ స్థానం), జేపీమోర్గాన్‌ చేజ్‌ చీఫ్‌ జామీ డిమాన్‌ (23), లాక్‌హీడ్‌ మార్టిన్‌ సారథి మార్లిన్‌ హీసన్‌ (37), డిస్నీ సీఈవో రాబర్ట్‌ ఐగర్‌ (55), యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (62), సాఫ్ట్‌బ్యాంక్‌ అధిపతి మసయోషి సన్‌ (96) ఉన్నారు. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా, లాటిన్‌ అమెరికా, ఆస్ట్రేలియాల్లోని సంస్థలను పరిగణనలోకి తీసుకున్నామని హెచ్‌బీఆర్‌ తెలిపింది. 

alsor read గూగుల్‌లో ఉద్యోగుల అసమ్మతి

15 ఏళ్లుగా పనిచేస్తున్న సీఈవోలను లెక్కించామని హెచ్బీఆర్ పేర్కొన్నది. కాగా, మహిళా సీఈవోలు తక్కువగా ఉన్నారని హెచ్‌బీఆర్‌ తెలిపింది. 2018లో ముగ్గురు మహిళలు ఈ జాబితాలో ఉండగా, ఈసారి నలుగురు మహిళామణులు ఉన్నారు. అంతకుముందు ఏండ్లలో ఇద్దరే ఉన్నారని గుర్తుచేసింది. 

ఈ జాబితాలో మహిళ సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రతియేటా పాఠకులు విమర్శిస్తుంటారని హెచ్బీఆర్ పేర్కొంది. కానీ పనీతీరు వల్ల వారు చోటు దక్కించుకోకపోవడం ఉండదని, అసలు పని చేసే మహిళలే తక్కువగా ఉండటం విచారకరం అని తెలిపింది. 
 

click me!