ఇళ్ళు, వాహనాల రుణాలు మరింత చౌకగా....

By Sandra Ashok KumarFirst Published Feb 7, 2020, 3:10 PM IST
Highlights

ఇంటి, వాహనాల రుణాలు మరింత చౌక కానున్నాయి. ఇందుకు ఎస్బీఐ తన ఎంసీఎల్ఆర్ అంటే వడ్డీరేట్లను తగ్గించడమే కారణం. ఇది వరుసగా తొమ్మిదోసారి. రియాల్టీ, ఎంఎస్ఎంఈ రంగాలకు ఇచ్చిన రుణాలు కూడా చౌకగా మారనున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఉత్తేజం కల్పించడం లక్ష్యంగా వాణిజ్య కార్యకలాపాల ప్రారంభ తేదీని (డీసీసీఓ) మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ప్రకటించడమే కారణం. ఎంఎస్ఎంఈల రుణాలను పునర్వ్యవస్థీకరించడానికి మరో ఏడాది గడువు పెంచారు.
 

ముంబై/ న్యూఢిల్లీ: ఇంటి, ఆటోమొబైల్ వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. దీనికి ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వరుసగా తొమ్మిదో సారి వడ్డీరేట్లు (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించడమే కారణం. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ 7.90 శాతంగా ఉంది. తాజా తగ్గింపుతో ఎంసీఎల్ఆర్ 7.85 శాతానికి చేరినట్లు తెలుస్తోంది. 

ఈ సరికొత్త వడ్డీరేట్లు ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. రుణాలు కూడా 6.8 శాతం పెరిగాయని ఎస్బీఐ తెలిపింది. డిసెంబర్ నెలతో ముగిసే సంవత్సరానికి రుణాలు రూ.23,01,669 కోట్లు చేరుకున్నాయని పేర్కొంది. వ్యక్తిగత రుణాలు 17.49 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే వడ్డీరేట్లు తగ్గించకున్నా ఆర్బీఐ బ్యాంకులకు అదనపు నిధులు అందుబాటులో ఉండేలా చేసింది. దీంతో కీలక రంగాలకు రుణవితరణ పెంచి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

also read అలాంటి యాడ్స్ పై ఇక నుంచి 50 లక్షల జరిమానా, ఐదు ఏళ్ల జైలు శిక్ష....

దీనికి తోడు బ్యాంకులకు ప్రస్తుతం అందిస్తున్న స్వల్పకాలిక రుణ మద్దతును దీర్ఘకాలానికి విస్తరించేందుకు దీర్ఘకాలిక రెపో వసతిని కూడా ప్రకటించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఉత్తేజం కల్పించడం లక్ష్యంగా వాణిజ్య కార్యకలాపాల ప్రారంభ తేదీని (డీసీసీఓ) మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

డెవలపర్ల చేతిలో లేని కారణాలతో ప్రాజెక్టుల్లో జాప్యమైతే ఆయా ప్రాజెక్టులకు లభించిన రుణాలను నాణ్యత లేని రుణాలుగా వర్గీకరించడానికి కొంత వ్యవధి లభిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు వెన్నుగా నిలిచే ఎంఎస్ఎంఈ రుణఖాతాల పునర్నిర్మాణ సదుపాయాన్ని కూడా వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. 

గతేడాది జనవరి నాటికి ప్రమాణాత్మక రుణాలుగా ఉండి ఆ తర్వాత బకాయి పడిన వాటిని నాణ్యత లేని రుణాలుగా వర్గీకరించడం ఏడాది పాటు వాయిదా పడుతుంది. 2020 డిసెంబర్ 31 లోగా ఆ ఎంఎస్ఎంఈలు ఈ రుణాల ఏకకాల పునర్నిర్మాణం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సవివరమైన మార్గదర్శకాలు త్వరలో జారీ చేయనున్నట్టు ప్రకటించింది.

also read వచ్చే ఐదేళ్లలో...ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే.. ఎస్‌బి‌ఐ చైర్మన్
 
ఆర్‌బీఐ ప్రకటించే రెపో రేట్ల ప్రయోజనం బ్యాంకులు తక్షణం కస్టమర్లకు వర్తింపచేయడానికి బ్యాంకులకు ఆర్‌బీఐ రూ.లక్ష కోట్ల దీర్ఘకాలిక రెపో వసతిని ప్రకటించింది. ఈ దీర్ఘకాలిక రెపో కాలపరిమితి ఏడాది నుంచి మూడేళ్లకు విస్తరిస్తుంది. ఈ నెల 15వ తేదీ నుంచే ఇవి అమలులోకి వస్తాయి. 

సాధారణ రెపో వసతి ఒక రోజు నుంచి 15 రోజులే ఉండగా ప్రస్తుతం ఆర్‌బీఐ వర్తింపచేస్తున్న దీర్ఘకాలిక రెపో కాలపరిమితి 56 రోజులు ఉంటుంది. ఏడాది నుంచి మూడేళ్ల విస్తరణ గల రెపో వసతి ద్రవ్య విధాన ప్రయోజనాలు మరింత త్వరితంగా ప్రజలకు అందింపచేయడంలో ఒక కొత్త శకాన్ని ఆవిష్కరిస్తుందని భావిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ చెప్పారు.

click me!