
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సిఎస్ఎస్)తో సహా చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇక నుంచి ఆధార్, పాన్ కార్డు తప్పనిసరి. చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 31, 2023న ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. ఈ మార్పులు చిన్న పొదుపు పథకాల కోసం KYCలో భాగంగా పరిగణిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ సర్క్యులర్ను జారీ చేయడానికి ముందు, ఆధార్ కార్డును సమర్పించకుండా చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది..
అయితే, ఇక నుంచి ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు కనీసం ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ అవసరం. అలాగే, ఈ నోటిఫికేషన్లో, నిర్దిష్ట పరిమితులకు మించిన పెట్టుబడులకు పాన్ కార్డ్ సమాచారాన్ని అందించడం తప్పనిసరి అని పేర్కొంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం చిన్న పొదుపు పథకం కొత్త రూల్స్ PPF, SSY, NSC, SCSS ఖాతా తెరిచేటప్పుడు ఆధార్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ గతంలోనే చిన్న మొత్తాల పొదుపు ఖాత ఓపెన్ చేసి ఉంటే,సెప్టెంబర్ 30, 2023లోపు ఆధార్ నంబర్ను సమర్పించాలి.
ఒకవేళ మీరు ఆధార్ నంబర్ లేకుండా ఏదైనా స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను తెరవాలనుకుంటే, మీరు ఖాతా తెరిచిన ఆరు నెలల్లోపు ఆధార్ నంబర్ను సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఆధార్ నంబర్ అందుబాటులో లేకుంటే, ఆధార్ రిజిస్ట్రేషన్ నంబర్ను కూడా అందించవచ్చు.
చిన్న పొదుపు ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత ఆధార్ నంబర్ సమర్పించకపోతే, ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. చిన్న పొదుపు పథకాలలో ఇప్పటికే ఖాతాలు కలిగి ఉండి ఆధార్ నంబర్ను అందించడంలో విఫలమైన వారి ఖాతాలు అక్టోబర్ 1, 2023 నుండి స్తంభింపజేయబడతాయి.
నోటిఫికేషన్లో ఏముంది?
చిన్న పొదుపు పథకాల కోసం ఖాతా తెరిచేటప్పుడు పాన్ జోడించడం తప్పనిసరి అని నోటిఫికేషన్ పేర్కొంది. ఖాతా తెరిచే సమయంలో పాన్ సమర్పించనట్లయితే, కింది సందర్భాలలో ఖాతా తెరిచిన రెండు నెలలలోపు సమర్పించాలి.
ఖాతాలో ఎప్పుడైనా బ్యాలెన్స్ రూ.50 వేలు
ఖాతాలోని మొత్తం క్రెడిట్లు లేదా ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష దాటితే, రెండు నెలల వ్యవధిలో డిపాజిటర్ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను సమర్పించాలి. లేకపోతే , అతడి ఖాతాల కార్యాలయానికి పాన్ కార్డు సంఖ్యను సమర్పించే వరకు అతని ఖాతా ఆపరేషన్ నిలిపివేయనున్నారు. అని నోటిఫికేషన్ పేర్కొంది.