గడువు దాటాక.. పాన్ కార్డు లింక్ చేయకుంటే.. రూ.10 వేల ఫైన్

By narsimha lodeFirst Published Mar 22, 2020, 10:30 AM IST
Highlights

పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు అవకాశం ఇచ్చింది. తుది గడువును పొడిగించుకుంటూ వచ్చింది. 

న్యూఢిల్లీ: పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు అవకాశం ఇచ్చింది. తుది గడువును పొడిగించుకుంటూ వచ్చింది. తాజాగా 2020 మార్చి 31వ తేదీ ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి తుది గడువు. ఈ గడువులోపు ఈ రెండింటినీ లింక్‌ చేయకపోతే పాన్‌ పని చేయకుండా పోతుంది.

అయినా ఇదే పాన్‌ నెంబర్‌తో లావాదేవీలు నిర్వహిస్తే ఆదాయం పన్ను శాఖ జరిమానా విధించనున్నది. ఇప్పటికే చాలా మంది తమ పాన్‌ కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానించి ఉంటారు.

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయని వారు గడువు తేదీ తర్వాత బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఆదాయం పన్ను శాఖ రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్ని సార్లు కూడా జరిమానా పడే అవకాశం ఉండవచ్చు. 

అందుకే వెంటనే పాన్‌, ఆధార్‌ను అనుసంధానం చేసేసుకోండి. మీరు మీ ఆదాయ రిటర్నును ఫైల్‌ చేయాలంటే ఈ రెండింటి అనుసంధానం తప్పనిసరి. బ్యాంకు ఖాతా ప్రారంభానికి, స్థిరాస్తుల క్రయవిక్రయాలకు, రుణ దరఖాస్తుకు, క్రెడిట్‌ కార్డు దరఖాస్తుకు, పెట్టుబడులకు పాన్‌ అవసరం ఉంటుంది. 

మీరు చాలా తక్కువ సమయంలోనే పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయవచ్చు. http://www. incometaxindiaefiling.gov.in/ homeను ఓపెన్‌ చేయండి.  అందులో పాన్‌, ఆధార్‌ తదితర వివరాలు ఎంటర్‌ చేయడం ద్వారా ఈ రెండింటినీ అనుసంధానం చేయవచ్చు. 

ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్‌)ను గడువు తర్వాత ఫైల్‌ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి (2019 -20 అసెస్‌మెంట్‌ సంవత్సరం) టాక్స్‌ రిటర్నుల ఫైలింగ్‌ గడువు 2019 జూలై 31. దీన్ని నెల రోజులు పొడిగించారు.

ఒకవేళ ఈ గడువు వరకు ఫైలింగ్‌ చేయని వారికి ఉండే గడువు 2019 డిసెంబర్ 31. అప్పుడు కూడా ఫైలింగ్‌ చేయని వారికి తుది డెడ్‌లైన్‌ 2020 మార్చి 31. దీనికి జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

మీ ఆదాయం రూ.5 లక్షలకన్నా తక్కువ ఉండి లేటుగా ఫైలింగ్‌ చేస్తే రూ.1,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షలు దాటి ఉంటే మీరు మార్చి 31 వరకు ఫైలింగ్‌ చేస్తే జరిమానా రూ.10,000 వరకు ఉండవచ్చు. 

ఐటీఆర్‌ ఫైలింగ్‌ చేయకుండా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడితే ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి గడువులోపు మీ రిటర్నులను సమర్పించే పనిపై దృష్టిపెట్టడం మంచిది. 

మరోవైపు గృహ రుణంతో మొదటిసారిగా అందుబాటు ధరల్లో ఇంటిని కొనుగోలు చేసే వారికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనా-అర్బన్‌ స్కీమ్‌ (పీఎంఏవై) కింద వడ్డీ సబ్సిడీని పొందడానికి అవకాశం ఉంటుంది. 

నాలుగు రకాల ఆదాయ కేటగిరీల్లోని వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో మధ్య ఆదాయం గ్రూప్‌-1, మధ్య ఆదాయం గ్రూప్‌ -11 కింద వచ్చే మార్చి 31 వరకు ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 

Also read:యెస్ ఇది నిజం: బీఎస్-4 బైక్స్‌పై ‘కరోనా’ డిస్కౌంట్లు.. భారీగా..

ఇంకా మార్చి 31వ తేదీతో 2019-20 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ తేదీ కొన్నింటికి డెడ్‌లైన్‌గా ఉంది. అవేమిటో తెలుసుకుంటే కొన్ని రకాల సమస్యలు, జరిమానాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. 

కొన్ని రకాల పెట్టుబడులు, బీమా పాలసీల కొనుగోలు ద్వారా ఆదాయం పన్ను చట్టం కింద మినహాయింపులు పొందవచ్చు. ఆదాయం పన్ను  చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను చెల్లింపుదారులు రూ.1.5 లక్షల వరకు మినహాయింపులు పొందవచ్చు.

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ కింద పెట్టుబడి పెట్టి సెక్షన్‌ 80సీసీడీ కింద రూ.50వేల వరకు మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది. 2019-20లో పన్ను భారం తగ్గించుకోవాలనుకుంటే మీకు మినహాయింపులు లభించే వాటిలో మార్చి 31వ తేదీలోగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

ప్రధాన మంత్రి వయ వందన యోజనా (పీఎంవీవీవై) పెన్షన్‌ పథకంలో చేరడానికి, దీని కింద ప్రయోజనాలు అందుకోవడానికి మార్చి 31 చివరి గడువు. అధిక వడ్డీతో మంచి ప్రయోజనాలు అందిస్తున్న పథకమిది. అర్హులైన వారు ఈ పథకాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోండి.. మిస్ చేసుకోవద్దని కోరుతున్నారు.
 

click me!