
సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అతిపెద్ద వాటాదారుగా అవతరించారు. ట్విట్టర్లో 9.2 శాతం వాటాలను కలిగి ఉన్నట్లు యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్లో దాఖలు చేసిన ఫైలింగ్లో మస్క్ ఈ సంగతి చెప్పారు. ఆయనకు ట్విట్టర్లో 7,34,86,938 షేర్లు ఉన్నాయి. ట్విట్టర్లో వాటాలను మస్క్ కొనుగోలు చేసిన వార్త బయటకు రాగానే సోమవారం ట్రేడింగ్లో ఆ సంస్థ స్క్రిప్ట్ 26 శాతానికి పైగా దూసుకెళ్లి 49 డాలర్ల వద్ద నిలిచింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ట్విట్టర్ షేర్ 39.31 డాలర్లుగా ఉంది.
ట్విట్టర్లో మస్క్ వాటా 2.89 బిలియన్ డాలర్లు. దీంతో ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థలోని అతిపెద్ద వాటాదారుల్లో ఒకరిగా మస్క్ నిలిచారు. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ కంటే మస్క్కు నాలుగు రెట్లు వాటాలు ఉన్నాయి. జాక్ డోర్సీ కేవలం 2.25 శాతం వాటాలు మాత్రమే కలిగి ఉన్నారు. ట్విట్టర్ పాలసీలపై నిత్యం విమర్శలు గుప్పించేవారు మస్క్. కానీ సుదీర్ఘ కాలం ట్విట్టర్ మనుగడ సాగించడానికి ఆ సంస్థ పాలసీలే కీలకంగా మారాయి.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. మస్క్ ధీర్ఘకాలిక మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టారు. గతంలో ట్విట్టర్ సామర్థ్యంపై, వాక్ స్వాతంత్య్రంపై మస్క్ అనేక ప్రశ్నల్ని సంధించారు. దీంతో పాటు కొత్త సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు. మస్క్ పెట్టుబడుల విషయం తెలిసి సోమవారం మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్లు 25 శాతం పెరిగాయి. అదే సమయంలో టెస్లా షేర్లు కూడా స్వల్పంగా పెరిగాయి. టెస్లా మొదటి త్రైమాసిక ఉత్పత్తి ఫలితాలను నమోదు చేసిన రెండు రోజుల తర్వాత మస్క్.. ట్విట్టర్ వాటా కొనుగోలు గురించి వెల్లడించారు. టెస్లా ఈ త్రైమాసికంలో 3,10,000 వాహనాలు డెలివరీ చేసినా.. అంచనాలను అందుకోలేకపోయింది. ట్విట్టర్ను అప్పటి బాస్ జాక్ డోర్సీ సరిగ్గా నిర్వహించలేకపోతున్నారని ఎల్లియాట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ 2020 లోనే విమర్శలు చేసింది. అయితే గతేడాది నవంబర్లో జాక్ డోర్సీ సీఈఓ, ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయనకు ప్రస్తుతం 2.25 శాతం వాటాలు ఉన్నాయి.
అంతేకాకుండా.. ఎలాన్ మస్క్ ఏప్రిల్ 4వ తేదీన ట్విట్టర్ ముందు ఓ ప్రశ్న ఉంచారు. ఎడిట్ బటన్ ఉండాలా? అని మస్క్ ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ట్వీట్పై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందించారు. ఈ పోల్ పరిణామాలు చాలా ముఖ్యమైనవని, చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని ట్వీట్ చేశారు.