ఇళ్లు కొనేవారు కరువు ? 9 నగరాల్లో 67 శాతం తగ్గుదల..

By Sandra Ashok KumarFirst Published Jul 11, 2020, 11:50 AM IST
Highlights

దేశవ్యాప్తంగా గృహ విక్రయాలపై కరోనా లాక్​డౌన్​ ప్రభావం తీవ్రంగా పడింది. దేశంలలోని 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఏప్రిల్-జూన్ మధ్య 67 శాతం తగ్గినట్లు ప్రాప్-ఈక్విటీ నిర్వహించిన సర్వేలో తెలిసింది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ మహమ్మారిని కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో స్థిరాస్తి రంగం తీవ్రంగా కుదేలైంది. లాక్​డౌన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 67 శాతం తగ్గాయని రియల్టీ విశ్లేషణ సంస్థ ప్రాప్-ఈక్విటీ నివేదికలో తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 9 నగరాల్లో కేవలం 21,294 గృహాలు విక్రయం అయ్యాయని ప్రాప్-ఈక్విటీ సంస్థ ప్రకటించిన నివేదిక తెలిపింది.  2019 ఇదే సమయంలో 64,378 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడు పోయాయి.

ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ఇటీవల విడుదల చేసిన ఓ సర్వేలో దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో 2020 ఏప్రిల్-జూన్​ మధ్య ఇళ్ల అమ్మకాలు ఏకంగా 81 శాతం తగ్గినట్లు తెలిసింది. గడిచిన మూడు నెలల్లో ఏడు నగరాల్లో 12,740 యూనిట్లు మాత్రమే విక్రయం అయ్యాయని అనరాక్​ వెల్లడించింది.

నోయిడా మినహా మిగతా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గాయి. గరుగ్రామ్​లో గృహ అమ్మకాలు అత్యధికంగా 79 శాతం తగ్గాయి. గుర్ గ్రామ్ పరిధిలో మూడు నెలల్లో 361 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇక్కడ 1,707 ఇళ్లు అమ్ముడయ్యాయి.

also read చిన్న పరిశ్రమల కోసం మాస్టర్‌కార్డ్‌ రూ.250 కోట్ల సాయం.. ...

ఇళ్ల విక్రయాల్లో 75 శాతం క్షీణతతో కోల్​కతా రెండో స్థానంలో ఉంది. మూడు నెలల్లో ఇక్కడ 1,046 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 ఇదే సమయంలో ఈ సంఖ్య 4,152 యూనిట్లుగా ఉంది.

హైదరాబాద్​, చెన్నైలో ఇళ్ల విక్రయాలు 74 శాతం తగ్గి 996 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ నగరాల్లో 1,522 యూనిట్లు అమ్ముడు పోయాయి. బెంగళూరులో మూడు నెలల్లో 73 క్షీణతతో 2,818 యూనిట్లు విక్రయమయ్యాయి. 2019లో ఇక్కడ 10,583 గృహాలు అమ్ముడవ్వడం గమనార్హం.

మహారాష్ట్రలో ఇళ్ల విక్రయాలు అత్యధికంగా ముంబైలో 63 శాతం తగ్గాయి. మూడు నెలల్లో ఇక్కడ 2,206 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఠాణెలో 56 శాతం, పుణెలో 70 శాతం ఇళ్ల విక్రయాలు పడిపోయాయి. 

ఠాణెలో 5,999 యూనిట్లకు, పుణెలో 5,169 ఇళ్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. అన్ని నగరాల్లో విక్రయాలు క్షీణించినప్పటికీ దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) నోయిడాలో మాత్రం అనూహ్యంగా గత మూడు నెలల్లో ఇళ్ల విక్రయాలు 5 శాతం పెరిగాయి. ఈ సమయంలో మొత్తం 1,177 యూనిట్లు అమ్మడయ్యాయి.

click me!