3 నెలలకు ప్రయాణ వాహన విక్రయాల్లో స్వల్ప పెరుగుదల

By sivanagaprasad kodatiFirst Published Nov 11, 2018, 12:17 PM IST
Highlights

దేశీయంగా ప్రయాణికుల వాహన (ప్యాసింజర్‌ వెహికల్స్‌/కార్లు, జీపులు) విక్రయాలు అక్టోబర్‌ నెలలో పర్వాలేదనిపించాయి. వరుసగా మూడు నెలల క్షీణత తర్వాత అక్టోబర్‌లో అమ్మకాలు పుంజుకున్నాయి. 


దేశీయంగా ప్రయాణికుల వాహన (ప్యాసింజర్‌ వెహికల్స్‌/కార్లు, జీపులు) విక్రయాలు అక్టోబర్‌ నెలలో పర్వాలేదనిపించాయి. వరుసగా మూడు నెలల క్షీణత తర్వాత అక్టోబర్‌లో అమ్మకాలు పుంజుకున్నాయి.

1.55 శాతం మేర వృద్ధి నమోదైనట్టు ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) తెలిపింది. అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వెహికల్స్‌ విక్రయాలు 2,84,224 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే మాసంలో అమ్ముడైనవి 2,79,877 కావడం గమనార్హం.

ఈ ఏడాది ప్రయాణ వాహనాల విక్రయాలు జూలైలో అమ్మకాలు 2.71 శాతం, ఆగస్ట్‌లో 2.46 శాతం, సెప్టెంబర్‌లో ఏకంగా 5.61% చొప్పున తగ్గిపోయాయి. అక్టోబర్‌లో విక్రయాలు పుంజుకోవడంతో వాహన కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. అన్ని విభాగాల్లోనూ అమ్మకాలను కలిపి చూస్తే అక్టోబర్‌లో 15.33% వృద్ధితో 24,94,426 యూనిట్లకు చేరాయి.

గతేడాది అక్టోబర్‌లో అమ్మకాలు 21,62,869 యూనిట్లే కావడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ వరకు చూసుకుంటే ప్యాసింజర్‌ వెహికల్స్‌ విక్రయాలు 6.10% పెరిగాయి. 20,28,529 లక్షల వాహనాలు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడైనవి 19,11,883గానే ఉన్నాయి. 

ఈ ఏడాది పండుగల సీజన్‌లో నూతన వాహనాల విక్రయాల్లో పెద్ద పురోగతేమీ కనిపించలేదు. మహీంద్రా అండ్ మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్, ఓఎల్ఎక్స్, ట్రుబిల్ వంటి విభాగాల్లో మాత్రం 40-50 శాతం విక్రయాలు పెరిగే అవకాశాలు నమోదయ్యాయి.

గమ్మత్తేమిటంటే పలు కార్ల తయారీ సంస్థలు నూతన మోడల్ కార్లను మార్కెట్లోకి ఆవిష్కరించాయి. కార్ల విక్రయాలను పెంపొందించేందుకు కొన్ని మోడల్ కార్ల ధరలను తగ్గించేశాయి. వాటిలో మారుతి సుజుకి స్విఫ్ట్, హోండా సిటీ, మారుతి ఆల్టో, నూతనంగా విడుదల చేసిన ఆల్టోస్ మోడల్ కార్లు కూడా ధరలను తగ్గించిన వాటిలో ఉన్నాయి.

ఒఎల్ఎక్స్ ఇండియా (కార్ల తయారీ విభాగం) ఉపాధ్యక్షుడు సన్నీ కఠారియా మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే 50 శాతం విక్రయాలు పెరుగుతాయి అంచనా వేశారు. మెట్రో నగరాల పరిధిలో 60 శాతం, ఇతర నగరాల పరిధిలో 50 శాతం విక్రయాలు జరుగుతాయని సన్నీ కఠారియా తెలిపారు. 

click me!