
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భారతీయ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల పడిపోయిన తమ కార్ల విక్రయాలను ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లను అందిస్తోంది మెర్సిడెస్ బెంజ్. ముఖ్యంగా దఫాల వారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తోంది.
ఇంకా మెర్సిడెస్ బెంజ్ సరసమైన ఈఎంఐ వసతి, రెండేళ్ల కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ తదితర ఆఫర్లను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడల్ కార్లపై ఈ ఆఫర్లను అందించనున్నామని మెర్సిడెస్ బెంజ్ గురువారం ప్రకటించింది.
ఈ ఆఫర్లకు తోడు రెండు తమ వాహనాలపై తాజా అప్గ్రేడ్స్ను అదనంగా ఎలాంటి చార్జ్ వసూలు చేయకుండానే అందిస్తామని మెర్సిడెస్ బెంజ్ ప్రకటనలో తెలిపింది. ఆఫర్లలో భాగంగా, ఒక కస్టమర్ వాహనం ఖరీదులో నాలుగింట ఒక వంతు ప్రారంభ చెల్లింపుగా చెల్లించి, మిగతా మొత్తం మూడు సమాన వార్షిక వాయిదాలలో చెల్లించి మెర్సిడెస్ బెంజ్ కారును సొంతం చేసుకోవచ్చు.
సి, ఇ, ఎస్-క్లాస్, సీఎల్ఎ, జీఎల్ఎ, జీఎల్సి, జీఎల్ఇ, జీఎల్ఎస్ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతోపాటు వినియోగదారుడు 60 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని కారును కూడా సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు..40 శాతం దాకా తక్కువ ఈఎంఐ ఆఫర్ కూడా అందిస్తోంది. మెయింటెనెన్స్, వారంటీ, కచ్చితమైన బై బ్యాక్ ఆఫర్ కూడా ఇందులో భాగం. దీంతోపాటు రెండేళ్ల కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ ఉచితం.
కార్ల కొనుగోలుపై వినియోగదారుడికి ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించడం ద్వారా కస్టమర్ విశ్వాసాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో ఈ ఆఫర్లను సుకొచ్చామని, భారతీయ వినియోగదారుల నాడిని అర్థం చేసుకున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. తమ మొత్తం పోర్ట్ఫోలియో బీఎస్ -6 నిబంధనలకనుగుణంగా క్రమంగా ముందుకు సాగుతోందన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే 60 శాతం కార్లలో బీఎస్ -6 ప్రమాణాల అమలు పూర్తయిందని వచ్చేనెలాఖరు నాటికి 80 శాతానికి చేరుకుంటుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు. ఆటో పరిశ్రమ 2001 నుండి మందగమనాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది 40 వేల యూనిట్లకు పైగా విక్రయించిన సంస్థ ప్రస్తుత సంవత్సరం జనవరి-జూన్ కాలంలో 3 నుంచి 5 వేల కార్లను విక్రయించింది.