వైసీపీ అధినేత జగన్ సోదరి, ఆ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల శుక్రవారం బస్సు యాత్ర ప్రారంభించారు.
వైసీపీ అధినేత జగన్ సోదరి, ఆ పార్టీ మహిళా నాయకురాలు షర్మిల శుక్రవారం బస్సు యాత్ర ప్రారంభించారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేకపోవడంతో.. బస్సు యాత్ర ద్వారా జనాలకు పార్టీని మరింత దగ్గర చేయాలని ఈ యాత్ర చేపట్టారు. ఇప్పటికే జగన్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ యాత్రలో మిస్ అయిన ప్రాంతాలను ఈ బస్సు యాత్రతో కవర్ చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ యాత్రను తాడేపల్లిలో ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని బోటుయార్డ్ భూ సమీకరణ బాధిత రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి ఉండవల్లి సెంటర్ లో పార్టీ కార్యకర్తలను కలుస్తారు.
అనంతరం పట్టణంలోని సాయిబాబా మందిరం సమీపంలోని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద పసుపు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటారు. అక్కడ నుంచి నులకపేట మీదుగా డోలాస్నగర్ చేరుకుని అక్కడ మహిళా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మంగళగిరి పట్టణానికి చేరుకుని, సాయంత్రం ఐదు గంటలకు పాతబస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.