తెలంగాణలో ట్రక్కు గుర్తు..ఏపీలో హెలికాప్టర్.. విజయసాయిరెడ్డి

By ramya NFirst Published Mar 27, 2019, 2:19 PM IST
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విమర్శల వర్షం కురిపించారు. 


వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విమర్శల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. చంద్రబాబు, కేఏ పాల్ లను చంద్రబాబు నడిపిస్తున్నారని మండిపడ్డారు.

‘‘గడువు దాటినాక కెఎ పాల్ భీమవరంలో నామినేషన్ వేసేందుకు వెళ్లడం అంతా చంద్రబాబు స్కెచ్ ప్రకారమే జరిగింది. చివరకు పాల్ కాళ్లు పట్టుకునే స్థితికి దిగిజారిపోయావా బాబూ. అతని గుర్తు, కండువా రంగు, అభ్యర్థుల ఎంపిక అంతా చంద్రబాబే డిసైడ్ చేశారు. భూకంపం వచ్చినపుడు కొండలు కూడా బద్దలవుతాయి.’’ అని విజయసాయి రెడ్డి అన్నారు.

‘‘తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమి “ట్రక్కు” గుర్తుతో అభ్యర్థులను నిలబెట్టింది. టీఆరెస్ “కారు” గుర్తును పోలి ఉండటంతో ట్రక్కుకు కూడా ఓట్లు పడ్డాయి. కాని కారు పార్టీనే గెలిచింది.ఏపీలో అదే నీచానికి ఒడిగట్టి కెఎపాల్ “హెలికాప్టర్”తో ఫ్యాన్ కు నష్టం కలిగించాలని చూస్తున్నాడు’’ అని ఆరోపించారు.

‘‘పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, నవీన్ పట్నాయక్, పళని సామి ఏపీని దోచుకోవాలని చూస్తున్నారని గుండెలు బాదుకుంటున్నావు. ఐదేండ్లలో మట్టి, ఇసుకతో పాటు అన్ని వనరులను బొక్కి రాష్ట్రాన్ని వల్లకాడులా మార్చావు. ఎవరొచ్చినా ఏం మిగిలింది చంద్రబాబూ. ఏడుపు సీన్లు తగ్గించు’’ అని చంద్రబాబుని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

‘‘తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. చంద్రబాబు గారేమో పార్టనర్లతో కలిసి ఎవరిని తిట్టించాలా అని పథకాలు వేస్తున్నారు. పచ్చ మీడియా చూపిస్తుంది కదా అని.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

click me!