వైఎస్ వివేకా హత్య... జగన్‌కు అన్ని తెలుసు: వర్ల కీలక వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 18, 2019, 9:27 AM IST
Highlights

వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్‌ హత్యకు గల కారణాలు జగన్‌కు తెలుసునని, జగన్మోహన్ రెడ్డికి హత్యలు కొత్తేమీ కాదన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్‌ హత్యకు గల కారణాలు జగన్‌కు తెలుసునని, జగన్మోహన్ రెడ్డికి హత్యలు కొత్తేమీ కాదన్నారు.

వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయాలని సూచించింది జగనే అంటూ వర్ల ఆరోపించారు. అసలు నిజాలు బయటకు రాకుండా చేయడానికే సీబీఐ విచారణ అడుగుతున్నారని, ఆర్థిక నేరాల కేసుల్లో జైలులో గడపాల్సిన జగన్.. మోడీ సాయంతోనే ఎన్నికల బరిలో ఉన్నారని రామయ్య మండిపడ్డారు.

వివేకాకు హత్య జరిగిన అర్థరాత్రి ఒక మహిళ నుంచి వచ్చిన సెల్‌ సందేశాన్ని జగన్... గవర్నర్‌కు చూపకుండా సీబీఐ విచారణ అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ఇది పక్కా హత్య అని.. దీనిని సహజ మరణంగా చూపించాలనుకుంటున్నారని వర్ల ప్రశ్నించారు.

మొదటి కాల్ చేసినప్పుడు హత్య జరిగిందని జగన్‌కు చెప్పారా లేదా..? కుటుంబం పరువు పోతుందని జగన్ నిజాలు తొక్కి పెట్టారంటూ రామయ్య ఆరోపించారు. సొంత బాబాయ్ చనిపోతే బాధపడాల్సింది పోయి.. శవ రాజకీయాలు చేస్తావా..? రెండు రోజులు పోలీసులు మొత్తం బయటపెడతారని, అందరి జాతకాలు బయటపడతాయని వర్ల స్పష్టం చేశారు.

టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతూ.. బాబాయ్ చావుని కూడా జగన్ రాజకీయంగా వాడుకుంటున్నారని, హత్యా రాజకీయాల్లో నిండా మునిగిన జగన్ కుటుంబం ఆ రక్తపు మరకలను ఇతరులకు అంటించేందుకే వైసీపీ నేతలు టీడీపీపై నిందలు వేస్తున్నారని దినకర్ మండిపడ్డారు.

వైఎస్ హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి, పంచభూతాలను దోచేస్తే అప్పుడు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, అంజనేయరెడ్డి, లక్ష్మణరెడ్డి ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావుల అవినీతి దుర్గంధం నేటికి వెదజల్లుతోందన్నారు.

ప్రధాని మోడీ, కేసీఆర్, జగన్ డైరెక్షన్‌లో ఐవైఆర్‌ కృష్ణారావు నడుస్తున్నారని దినకర్ ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా సాక్షి పత్రికలో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. 

click me!