
విజయవాడ: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ఓడిపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవబోతుందని తెలిపారు.
తాను సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించకపోవడాన్ని అంబటి రాంబాబు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తాను అనారోగ్యం కారణంగానే సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించలేదని అంతేకానీ అంబటి రాంబాబు చెప్తే ఆగిపోలేదన్నారు.
అంబటి రాంబాబు అంటే తనకు గౌరవమని ఆయన కుమార్తె పెళ్లికి ఆహ్వానించారని అందుకు వెళ్లానని అయినంత మాత్రాన ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం రాకపోడానికి అదే కారణమని చెప్తే సరికాదన్నారు.
అంబటి రాంబాబు చెప్తేనే తాను సత్తెనపల్లిలో పర్యటించలేదన్నది అవాస్తవమన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయోద్దని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంబటి రాంబాబు భ్రమలో ఉన్నారని, కానీ అధికారంలోకి వచ్చేది జనసేన పార్టీ అని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ చెప్పినంత మాత్రాన అధికారంలోకి వచ్చేస్తాం అనుకుంటే దానంత పొరపాటు వేరొకటి ఉండదన్నారు. 2014లో కూడా కేసీఆర్ జగన్ అధికారంలోకి వస్తారని చెప్పారని కానీ సీన్ రివర్స్ అయ్యిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.