ఈవిఎంలు, పోలింగ్ తీరుపై సునీల్ అరోరాకు చంద్రబాబు 18 పేజీల లేఖ

By telugu teamFirst Published Apr 13, 2019, 1:14 PM IST
Highlights

ప్రజలు ఓటేయడానికి అర్థరాత్రి వరకు వేచి చూడాల్సిన దుస్థితిపై చంద్రబాబు సీఈసికి వివరించారు. ఈసీ తీరుపై, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎంల పనితీరుపై, పోలింగ్ తీరుపై ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసి)కి ఫిర్యాదు చేశారు. ఆయన శనివారం మధ్యాహ్నం సీఈసి సునీల్ అరోరాను కలిసి ఫిర్యాదు చేశారు. సునీల్ అరోరాకు ఆయన 18 పేజీల లేఖను అందజేశారు.

ప్రజలు ఓటేయడానికి అర్థరాత్రి వరకు వేచి చూడాల్సిన దుస్థితిపై చంద్రబాబు సీఈసికి వివరించారు. ఈసీ తీరుపై, ఈవీఎంల లోపాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని ఆయన నిర్ణయించుకున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. 

రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు శనివారం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీఈసిని కలిశారు. 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

click me!