ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు రాజకీయ నిరుద్యోగి అవుతారంటూ... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.
ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు రాజకీయ నిరుద్యోగి అవుతారంటూ... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబును విమర్శిస్తూ... ట్విట్టర్ లో ట్వీట్స్ చేయడం విజయసాయికి అలవాటే. కాగా... తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ను నిలిపి వేయించడానికి చంద్రబాబునాయుడు చేయని కుతంత్రం లేదని విజయసాయి ఆరోపించారు. వీవీప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడని తెలిపారు. తన అనుకూల వ్యక్తులతో ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయని ట్విటర్లో చురకలంటించారు.
‘‘23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాథి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు.’’ అని ఎద్దేవా చేశారు.
‘‘ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయి. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు.’’ అని ఆరోపించారు.
‘‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు అనుబంధంగా అమర్చిన ప్రింటర్ లాంటి పరికరాలే వీవీప్యాట్లు.ఇవిఎంలలో నమోదైన ఓట్ల ఆధారంగానే లెక్కింపు ఉంటుంది. వివిప్యాట్లను ముందు లెక్కించాలనే వాదన చూస్తే, గుర్రం బలంగా ఉందో లేదో చూడకుండా దాని తోకను కొలవాలనే మూర్ఖపు డిమాండులాగా కనిపిస్తోంది.’’ అని కౌంటర్ వేశారు.