ఓట్లను తొలగిస్తున్నారు, చంపేందుకు కూడా వెనుకాడరు: బాబుపై జగన్

Published : Mar 05, 2019, 03:46 PM IST
ఓట్లను తొలగిస్తున్నారు, చంపేందుకు కూడా వెనుకాడరు: బాబుపై జగన్

సారాంశం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు ఓట్లు వెయ్యరు అని తెలిస్తే వారిని చంపేందుకు సైతం చంద్రబాబు నాయుడు వెనుకాడరని ఆరోపించారు. ఒకవేళ కొన్ని గ్రామాలు ఓటెయ్యవని తెలిస్తే ఆ గ్రామాలకు నిప్పు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ సమరశంఖారాం బహిరంగ సభలో పాల్గొన్న  వైఎస్ జగన్ చంద్రబాబు తీరును ఎండగట్టారు. 

నెల్లూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమకు ఓటు వెయ్యరు అనే వారి ఓట్లను తొలిగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు ఓట్లు వెయ్యరు అని తెలిస్తే వారిని చంపేందుకు సైతం చంద్రబాబు నాయుడు వెనుకాడరని ఆరోపించారు. ఒకవేళ కొన్ని గ్రామాలు ఓటెయ్యవని తెలిస్తే ఆ గ్రామాలకు నిప్పు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. 

నెల్లూరు జిల్లాలో వైసీపీ సమరశంఖారాం బహిరంగ సభలో పాల్గొన్న  వైఎస్ జగన్ చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు ఒక దొంగ, ఆయన పాలన రాక్షస పాలన అంటూ ధ్వజమెత్తారు. చట్టం ఒప్పుకోని డేటాను చంద్రబాబు బినామీ కంపెనీలు దొంగతనం చెయ్యడం నేరం కాదా అంటూ ప్రశ్నించారు. 

ఏపీ ప్రజలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా, ప్రైవేట్ కంపెనీలు ఉండటం పెద్ద నేరమంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ, బ్లూ ఫ్రాగ్ వంటి కంపెనీలకు ప్రజల డేటా, పల్స్ సర్వే డేటా, యూఐడి డేటా, బ్యాంకు అకౌంట్ల డేటాను దొంగచాటుగా దోచిపెట్టారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. 

ప్రజల డేటాను దొంగిలించడమే కాకుండా ఆ డేటాను తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్ కు అనుసంధానం చేస్తూ టీడీపీలో సభ్యత్వం తీసుకున్న వారికి మెసేజ్ లు పంపిస్తున్నారని తెలిపారు. డేటా ఆధారంగా వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడం, మరో ఓటును యాడ్ చేసుకుంటూ వైసీపీ ఓట్లను తొలగించడం నేరమన్నారు. 

ఇలాంటి నేరస్థుడిని క్షమించకూడదన్నారు. డేటాను దొంగిలించింది చంద్రబాబునాయుడు అని చెప్పుకొచ్చారు. దొంగతనం చేసిన చంద్రబాబు తీరా దొరికిపోయే సరికి దొంగే దొంగ అంటూ నానా హంగామా చేస్తున్నారు. దొంగ ఓట్లను తొలగించి కొత్త ఓటర్లను యాడ్ చెయ్యమని వైసీపీ నిలదీసినా, అప్లికేషన్ ఇచ్చినా తామేదో అన్యాయం చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. 

చివరికి తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఓటును కూడా తొలగించారని కానీ లోకేశ్ ఓటు కానీ చంద్రబాబు ఓటు కానీ గల్లంతు కాలేదన్నారు. తప్పుచేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి వైసీపీ దొంగతనం చేసినట్లు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. 

ప్రజలకు సంబంధించి వ్యక్తిగత డేటాను ప్రైవేట్ కంపెనీలు దగ్గర ఉండటం సుప్రీకోర్టు సైతం నేరంగా పరిగణిస్తోందని జగన్ తెలిపారు. సిగ్గుమాలిన పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పుమీద తప్పు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu