ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే.. టీడీపీ ఇబ్బందుల్లో పడింది: వైవీ సుబ్బారెడ్డి

By Sumanth KanukulaFirst Published Sep 21, 2023, 2:17 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రజలు ఎవరూ సానుభూతి చూపడం లేదని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రజలు ఎవరూ సానుభూతి చూపడం లేదని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ ఇబ్బందుల్లో పడిందని.. ఆ పార్టీని నడిపించడానికి వేరొక పార్టీ అధ్యక్షుడిపై ఆధారపడిందని విమర్శించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విజయగణపతికి వైవీ సుబ్బారెడ్డి గురువారం పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం జగన్ దసరా నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తారని తెలిపారు. అందుకే విఘ్నాలు ఉన్నా తొలిగిపోవాలని పూజులు చేశామని చెప్పారు. మళ్లీ జగనే సీఎం అవ్వాలని గణనాథున్ని కోరుకున్నట్టుగా చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం కూడా గ్రోత్ హబ్ సెంటర్‌గా విశాఖను గుర్తించిందని చెప్పారు. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నామని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విశాఖ నుంచి పాలనతో ఉత్తరాంధ్రా ప్రజలకు భరోసా కల్పించనున్నామని చెప్పారు. 

చంద్రబాబు నాయుడు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయాడని విమర్శించారు. చట్టం తన పని తాను  చేసుకుంటూ పోతుందని.. కోర్టులపైన తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలొచ్చినా తాము సిద్దమేనని చెప్పారు. 

click me!