
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసం తన చిన్నాన్న వివేకా హత్య జరగలేదని.. సునీత పేరు మీదే ఆస్తులను వివేకా ఎప్పుడో వీలునామా రాశారని షర్మిల పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తిపై విష ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, కడప జిల్లా ప్రజలకు వివేకా ఎలాంటి వారో తెలుసునని షర్మిల స్పష్టం చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఆస్తుల కోసం వివేకాను చంపాల్సిన అవసరం లేదని షర్మిల మరోసారి పునరుద్ఘాటించారు.
కాగా.. వివేకా కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరోవైపు ఈ విషయమై ఎల్లుండి వాదనలు విన్పించేందుకు అనుమతివ్వాలని వైఎస్ సునీతారెడ్డి తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ఇవాళ ఉదయం హైకోర్టు ప్రారంభం కాగానే వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించాలని హైకోర్టును కోరారు.
అయితే ఇవాళ లిస్టైన కేసుల జాబితాలో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ అంశం లేదని హైకోర్టు తెలిపింది. లిస్ట్ కాని పిటిషన్లపై ఎలా విచారణ చేస్తామని హైకోర్టు ప్రశ్నించింది. ఈ పిటిషన్పై రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు విచారణ నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ విషయమై తమకు ఎల్లుండి వాదనలు విన్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్ సునీతారెడ్డి తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.
మరోవైపు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. రేపో మాపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సునీత సీబీఐకి ఇచ్చిన తొలి వాంగ్మూలంలో తేడా వుందన్నారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలంపై తమకు అనుమానాలు వున్నాయని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో సీబీఐ తనను కుట్రపూరితంగా ఇరికించాలని చూస్తోందన్నారు. వివేకా హత్య కేసు ఛేదన కంటే తనను ఇరికించేందుకే సీబీఐ ఎక్కువగా ప్రయత్నిస్తోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఒక ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్ధితి ఏంటని ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య రోజున తాను జమ్మలమడుగు వెళ్తున్నానని.. ఆ సమయంలో శివప్రకాశ్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు.