అమరావతి: కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మాజీ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ రాసిన లేఖపై విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం నాడు డీజీపి గౌతం సవాంగ్ కు లేఖ రాశారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టుగా మీడియాలో వచ్చింది. అయితే ఈ లేఖను తాను రాయలేదని రమేష్ కుమార్ ఓ న్యూస్ ఏజెన్సీకి అప్పట్లోనే చెప్పారు. అయితే ఈ లేఖ ఎవరు రాశారనే విషయమై ఇంకా సస్పెన్స్ ఉన్న విషయం తెలిసిందే.
కేంద్ర హోంశాఖకు లేఖ అందిన విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడ అప్పట్లోనే ధృవీకరించారు. అయితే ఈ లేఖ ఫోర్జరీ అని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో చేసిన సంతకానికి హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఉన్న సంతకానికి వ్యత్యాసం ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ , ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లు ఈ లేఖను సృష్టించారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.
ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై విచారణ జరిపించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు విజయసాయిరెడ్డి.
ఈ లేఖను పంపిన కంప్యూటర్ ఐపీ ఆధారంగా ఎవరు పంపారో గుర్తించాలని ఆయన కోరారు. నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని విజయసాయిరెడ్డి ఆ లేఖలో డీజీపీని కోరారు.
also read:
నిమ్మగడ్డ రమేష్ తొలగింపు: ఈ నెల 16 లోపుగా అఫిడవిట్ దాఖలుకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి రమేష్ కుమార్ ను తప్పిస్తూ రిటైర్డ్ జడ్జి కనగరాజ్ ను నియమిస్తూ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు.