
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ (ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) స్పందించారు. రాష్ట్రంలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా, వైసీపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతామని భయపడేవాళ్లే పొత్తుల గురించి ఆలోచిస్తారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేదని ... ఎప్పుడూ ఇతరులపై ఆధారపడే ఆయనను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
అటు వైసీపీ నేతల వల్లే ఏపీలో నేరాలు పెరిగిపోతున్నాయంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా ఆయన కౌంటరిచ్చారు. టీడీపీ నేతలే కిరాయి గూండాలతో రాష్ట్రంలో నేరాలు చేయిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీలో అత్యాచారాలు టీడీపీ నేతల పనే అని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలు చేసే అత్యాచారాలను, హత్యలను వైసీపీ ప్రభుత్వానికి అంటగడుతున్నారని విజయసాయి దుయ్యబట్టారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై TDP చీఫ్ Chandrababu Naidu శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం రావాలి, టీడీపీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే ఓ మెట్టు దిగుతానన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్దమేనని ఆయన తేల్చి చెప్పారు.
జనసేన (janasena) చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్ధించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాను ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ప్రచారానికి తెర తీసింది. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.
గతంలో కుప్పంలో చంద్రబాబు టూర్ సమయంలో కూడా జనసేనతో పొత్తుపై ఓ కార్యకర్త ప్రశ్నించారు. అయితే వన్ సైడ్ లవ్ సరైంది కాదని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించారు.