
టీడీపీ (tdp) అధికారంలోకి వస్తుందని... బురదపాములు హడావుడి చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (chintakayala ayyanna patrudu) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సన్నాసులంతా మంత్రులుగా కేబినెట్లో వున్నారని వ్యాఖ్యానించారు. బొత్సకు (botsa satyanarayana) విద్యాశాఖ.. అంబటికి (ambati rambabu) నీటి పారుదల శాఖా అంటూ అయ్యన్న ఫైరయ్యారు. గోదావరి మీద పులివెందుల ప్రాజెక్ట్ కడతారట అంటూ సెటైర్లు వేశారు. ఏం మాట్లాడుతున్నారో వారికైనా అర్దమవుతుందా అని ప్రశ్నించారు. జాబ్మేళాలో వచ్చేవి.. పొట్లాలు కట్టే జాబ్స్, సెక్యూరిటీ జాబ్స్ అంటూ వ్యాఖ్యానించారు .
మూడేళ్లలో ముఖ్యమంత్రి జగన్ (ys jagan) చేసిన ఒక్క మంచిపని లేదని అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. జగన్ బయటకు వచ్చి ప్రజా సమస్యలు స్వయంగా చూసింది లేదని ఆయన ఫైరయ్యారు. అప్పుడు రావాలి జగన్ అన్నారు.. ఇప్పుడు పోవాలి జగన్ అంటున్నారని అయ్యన్నపాత్రుడు కామెంట్స్ చేశారు. తల్లికి బర్త్డే విషెస్ చేయని దుర్మార్గుడు జగన్ అంటూ మండిపడ్డారు. సొంత చెల్లెలిని తరిమేసిన స్వార్థపరుడని.. బాబాయ్ హత్య కేసులో జగన్పై ఆరోపణలు ఉన్నాయని అయ్యన్నపాత్రుడు ఫైరయ్యారు.
వైజాగ్ జాబ్ మేళాపై అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శల్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) తోసిపుచ్చారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతని, ఆయన భూమికి భారంగా మారాడని ఆరోపించారు. తెల్లవారి లేస్తే ఏం పని లేక విమర్శలు చేయడం తప్పితే, ఉత్తరాంధ్రకి కానీ, రాష్ట్రానికి గాని ఆయనతో ఎలాంటి ఉపయోగం లేదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయన, ఆయన కుమారులు నిరుద్యోగులు గానే ఉన్నారని.. వస్తే వారికి కూడా ఉపాధి కల్పిస్తామంటూ ఆయన చురకలు అంటించారు. వైజాగ్ జాబ్ మేళాలో వేలాది ఉద్యోగాలు వస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.