పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆయనకు గుండెల్లో స్వల్పంగా నొప్పి రాగా.. మంగళవారం ఉదయానికి అది ఎక్కువ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను జంగారెడ్డి గూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు రాజమహేంద్రవరంలోని సాయి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెకు స్టంట్ అమర్చారు. ప్రస్తుతం బాలరాజు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.
అయితే ఎమ్మెల్యే బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆయన కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే బాలరాజును పరామర్శించారు.