రమేష్ కుమార్ కాదు... మా టార్గెట్ అదే: అంబటి సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Apr 10, 2020, 9:40 PM IST
Highlights

రాష్ట్ర ఎన్నికల సంఘాన్నిమరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని... అందుకోసమే జగన్ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుందని వైసిపి ఎమ్మెల్యే అంబటి  రాంబాబు అన్నారు. 

అమరావతి: ఎన్నికల కమిషనర్ వ్యవహారం విధానపరమైన నిర్ణయమని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఎస్ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ప్రజాస్వామ్యం కూలిపోతుందన్నారు. ఎన్నికల సంఘాన్నిమరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని... అందుకోసమే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని అన్నారు. 

విధానపరమైన నిర్ణయంలో టీడీపీ నేతలకు ఉన్న అభ్యంతరమేంటి? అని ఆయన ప్రశ్నించారు. వ్యక్తులను టార్గెట్ చేసి ఈ నిర్ణయాలు తీసుకోలేదని... కేవలం వ్యవస్థ బాగుకోసమే తీసుకున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారం ఎస్ఈసీకి ఉంటుందన్నారు. గవర్నరే ఎస్ఈసీని నియమిస్తారు ఇప్పుడు కొత్త విధానానికి ఆయనే ఆమోదం తెలిపారన్నారు. 

పూర్తి ప్రజాస్వామిక విధానంలో రాజ్యాంగ బద్దంగానే వ్యవహరించిందని... దీని ద్వారా ఎన్నికల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఎన్నికల సంఘంలో మార్పులు సహజమని... ఇందుకోసమే ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు. 

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోర్టు లు చెబుతున్నాయని గుర్తుచేశారు. కేంద్రంలో సాధారణ ఎన్నికల కోసం  కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఇవి నిష్పక్షపాతంగా పని చేసేలా చూడాలన్నారు. 

గతంలో ఐదు ఏళ్ళు పదవిలో ఉండేలా కమిషనర్ ఉండేవారు ఇప్పుడు మూడేళ్లు ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిపై టీడీపీ నేతలకు ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతల వాదన సరైనది కాదని... వ్యక్తులను టార్గెట్ చేసి నిర్ణయం తీసుకోలేదన్నారు. తమ మనిషి పోతున్నాడని టీడీపీ నేతలు బాధపడుతున్నారని అంబటి  ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర బడ్జెట్ కూడా ఆర్డినెన్సు ద్వారా ఆమోదించామని గుర్తుచేశారు. 243k నిబంధన ప్రకారం ఎన్నికల కమిషనర్ ను గవర్నర్ నియమిస్తారని...ఆయన పదవి మూడేళ్లకు తగ్గిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించారన్నారు. దీనిపై కొంపలు మునిగిపోయినట్లు చంద్రబాబు, కన్నా, నారాయణ గగ్గోలు పెడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకుంటుంది...ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశమని అంబటి పేర్కొన్నారు. 


 

click me!