బాబుకు షాక్: ఓటుకు నోటు కేసులో సుప్రీంలో ఆళ్ల మరో పిటిషన్

By narsimha lodeFirst Published Nov 25, 2019, 3:03 PM IST
Highlights

 ఓటుకు నోటు కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం నాడు సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశాడు

అమరావతి: ఓటుకు నోటు కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం నాడు సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశాడు. 2017లోనే ఆళ్ల రామకృష్నారెడ్డి పిటిషన్ దాఖలు చేశాడు. అయినా సుప్రీంకోర్టులో ఈ కేసు లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి ఇవాళ పిటిషన్ దాఖలు చేశాడు.

ఓటుకు నోటు కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. 2014 సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పుడు టీడీపీలో ఉన్న  రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కు చెందిన నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ దొరికాడు.

ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఆడియో టేపులను కూడ ఆ సమయంలో విడుదల చేసింది. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు నోటీసులు పంపారు.

ఈ కేసు విషయమై  చంద్రబాబునాయుడును ఇరుకున పెట్టాలని వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో  చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ఇంకా లిస్టింగ్ కాలేదు. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి ఎర్లీ హియరింగ్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేత వేం నరేందర్ రెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఐటీ అాదికారులు విచారించారు. ఈ కేసు విషయమై కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు కూడ ఇచ్చారు.ఈ కేేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో పలు అంశాలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుల్లో కేసులు దాఖలు చేశాడు. 

చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. 

click me!