నిన్నొదలా: ఎస్ఐపై జగన్ దాడి, గతాన్ని కెలుకుతున్న పవన్

Published : Nov 25, 2019, 01:55 PM ISTUpdated : Nov 25, 2019, 06:08 PM IST
నిన్నొదలా: ఎస్ఐపై జగన్ దాడి, గతాన్ని కెలుకుతున్న పవన్

సారాంశం

1994లో జరిగిన ఓ అంశాన్ని తెరపైకి తెచ్చి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.  పౌర హక్కుల సంఘం రాసిన కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో వైయస్ జగన్ ప్రస్తావన ఉన్న పేజీని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది జనసేన పార్టీ. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వైసీపీ ప్రభుత్వానికి అంటగడుతూ నానా హంగామా చేస్తోంది. 

సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత వైయస్ జగన్ 100 రోజుల పాలనపై అన్ని పార్టీలు స్పందిస్తే పవన్ కళ్యాణ్ 100 రోజుల పాలనతోపాటు 6 నెలల పాలనను సైతం తీవ్రంగా విమర్శించింది.

జగన్ ఆరునెలల పాలాన్ని ఆరు అంశాలతో పోలుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విమర్శలకు దిగారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సైతం ఆరు నెలల పాలనపై ఎలాంటి విమర్శలు చేయలేదు కానీ జనసేనాని మాత్రం గొంతెత్తి మరీ విమర్శించాడు. 

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తుంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా జనసేన వ్యవహరిస్తోందంటూ వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలను టీడీపీ కంటే జనసేన పార్టీయే ముందుగా ఖండిస్తూ నిరసనలకు దిగడమే అందుకు నిదర్శనం. 

తాజాగా 1994లో జరిగిన ఓ అంశాన్ని తెరపైకి తెచ్చి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.  పౌర హక్కుల సంఘం రాసిన కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో వైయస్ జగన్ ప్రస్తావన ఉన్న పేజీని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  

మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయల సీమ లోనేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని ,14 ఏళ్ల ‘సుగాలి ప్రీతి ‘ ఉదంతమే అందుకు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు.  

రాయల సీమలోనే, దళిత కులాల మీద దాడులు జరిగిన, బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారని వ్యాఖ్యానించారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది, మౌనంగా వినటమేనంటూ అభిప్రాయపడ్డారు. పోరాట యాత్రలో తనను యువత క లిసి వారి బాధలు వెల్లబోసుకుంటే తన గుండె కలచివేసిందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 

1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో, అనేక చేదు నిజాలు బయటకి వస్తాయంటూ తన ట్విట్టర్ లో పొందుపరిచారు. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎందుకు నలిగిపోతున్నారు. 

వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుందని ఆ పుస్తకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో  జగన్ రెడ్డి ప్రస్తావన కూడా ఉంటుందని పవన్ తెలుపుతూ ఆ పేజీని పోస్ట్ చేశారు.  

ఆ పేజీలో ఏముందంటే 1994 జూలై రాత్రి పులివెందుల తాలూకాలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఇటువంటి మరోక వింత జరిగిందని తెలిపింది. ఆ రాత్రి సింహాద్రిపురం ఎస్ఐ ప్రకాశ్ బాబు ముద్దనూరు నుంచి తన స్టేషన్ కు తిరిగి వస్తుండగా రోడ్డుపక్కన జీపు ఆపి తుపాకీ పట్టుకొని చట్ట విరుద్ధంగా వేట ఆడుతున్న కొంతమందిని ఎస్ ఐ చూశారు. 

వారందర్నీ స్టేషన్ కు రమ్మన్నాడు. తాము వైయస్ఆర్ కుమారుడు  జగన్ స్నేహితులమని చెప్పినా ఎస్ ఐ ఖాతరు చేయలేదని పుస్తకంలో పొందుపరిచింది. అయితే వారిలో ఒకడు తనకు వేట తుపాకీ ఉపయోగించే లైసెన్స్ ఉందనీ అది పులివెందులలో ఉందని చెప్పగా ఎస్ఐ అతనిని పులివెందుల పోయి లైసెన్స్  తీసుకొచ్చి చూపించే అవకాశం ఇచ్చాడు. 

అలా పులివెందుల వెళ్లిన యువకుడు జగన్మోహన్ రెడ్డి విషయంపై ఫిర్యాదు చేశాడు. రాజశేఖర్ రెడ్డి కొడుకునే ఖాతరు చేయడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయిదారు జీపులలో బయలుదేరి సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై దండెత్తాడు. 

ఎస్ఐ ప్రకాశ్ బాబును పట్టుకుని పోలీస్ స్టేషన్ లోపలే కొట్టాడు జగన్ అంటూ ఆ పుస్తకంలో ఉంది. అలా జగన్ ప్రస్తావన వచ్చిన 75వ పేజీని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది జనసేన పార్టీ. మరి దానిపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.  

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే