ఓటుకు నోటు కేసును త్వరగా విచారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసును త్వరగా విచారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఫిబ్రవరిలో ఈ కేసును లిస్ట్ చేసి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. అయితే తనను ఈ కేసులో ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.
ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కూడ సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఎన్నికల సభల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.
అయితే రాజకీయ శతృత్వం కారణంగానే చంద్రబాబునాయుడుపై ఈ పిటిషన్ దాఖలు చేశారని ఏపీ సీఎం తరపు న్యాయవాది సిద్దార్ధ సుప్రీంకోర్టుకు చెప్పారు. గతంలో కూడ ఈ కేసు విచారణ విషయమై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.