అది మహానాడు కాదు.. ఏడుపు నాడు, 2024లో వచ్చేది జగన్ ప్రభుత్వమే: బస్సు యాత్రలో మంత్రులు

Siva Kodati |  
Published : May 28, 2022, 09:02 PM ISTUpdated : May 28, 2022, 09:05 PM IST
అది మహానాడు కాదు.. ఏడుపు నాడు, 2024లో వచ్చేది జగన్ ప్రభుత్వమే: బస్సు యాత్రలో మంత్రులు

సారాంశం

తెలుగుదేశం పార్టీ ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుపై విమర్శలు చేశారు వైసీపీ మంత్రులు. సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర శనివారం నరసరావుపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. 

టీడీపీ, జనసేనలపై ఏపీ మంత్రులు ఘాటు విమర్శలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర శనివారం నరసరావుపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు టీడీపీ  మహానాడు వ్యతిరేకమన్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని.. బీసీలకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అని మంత్రులు  ప్రశ్నించారు. మహానాడులో అచ్చెన్నాయుడు బొమ్మ కూడా లేదని.. సామాజిక న్యాయం యాత్ర చేసే హక్కు తమకే వుందని మంత్రులు స్పష్టం చేశారు. ప్రజలు బస్సు యాత్రకు నీరాజనాలు పడుతుంటే చంద్రబాబుకు భయం వేస్తోందని.. అందుకే అబద్ధాల ఏడుపు ఏడుస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. 

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయ అవకాశాలు కల్పించింది జగన్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కేబినెట్‌లో 74 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు  అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్‌దని ఆదిమూలపు సురేష్ అన్నారు. టీడీపీ హయాంలో గిరిజన, మైనారిటీ శాఖలకు మంత్రులు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆయన గుర్తుచేశారు. తెలుగుదేశం హయాంలో బలహీన వర్గాలను ఓటు బ్యాంక్‌గానే చూశారని మంత్రి అన్నారు. 

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలను వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. పొత్తులు పెట్టుకున్నా, పొర్లు దండాలు పెట్టినా చంద్రబాబు ఓటమి ఖాయమని జోగి రమేష్ జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్నారు.  

మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. మూడేళ్లలో జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. బడుగు , బలహీన వర్గాల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి లబ్ధిదారు ఇంటికి సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయని.. మూడేళ్లలోనే 90 శాతానికి పైగా హామీలను జగన్ నెరవేర్చారని ధర్మాన స్పష్టం చేశారు. నాడు నేడు ద్వారా గ్రామాల్లో పాఠశాలలను ఆధునికీకరిస్తున్నామని మంత్రి చెప్పారు. సమాజంలో అంతరాలు తగ్గించేలా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని.. ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామన్నారు. కరోనా సంక్షోభంలోనూ పథకాల అమలు నిలిచిపోలేదని ధర్మాన స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రజలకు జగన్ అండగా నిలిచారని.. 9 నెలల పాటు ప్రజలకు నిత్యావసరాలు ఉచితంగా అందజేశారని మంత్రి తెలిపారు. టీడీపీ హయాంలో అంతా దోపిడీ పాలనే జరిగిందని .. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుతిన్నారని ధర్మాన ఆరోపించారు. 

మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో బడుగు, బలహీన వర్గాలను నట్టేట ముంచారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోరుకునే నాయకుడు జగన్ అని ఆమె అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ, సామాజిక విప్లవం నడుస్తోందని.. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత జగన్‌దేనని రజనీ అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. చంద్రబాబు విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌తో వున్నాడని.. ఆయన ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయాడని రజనీ ఎద్దేవా చేశారు. 

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ మహానాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమన్నారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది జగన్ మాత్రమేనని.. బస్సు యాత్రకు ప్రతిచోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. ఎంతమంది కలిసొచ్చినా జగన్‌ను ఎవరూ ఎదుర్కోలేరని.. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని అంబటి జోస్యం చెప్పారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదని మంత్రి అన్నారు. టీడీపీది మహానాడు కాదని.. ఏడుపునాడని సెటైర్లు వేశారు. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu