ప్రశ్నలు, సమాధానాలు ఇచ్చేశారు!.. చర్చనీయాంశంగా వైవీ సుబ్బారెడ్డి ప్రెస్‌మీట్..

By Sumanth KanukulaFirst Published Aug 25, 2023, 1:30 PM IST
Highlights

టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్ హాట్ టాపిక్‌గా మారింది.

టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్ హాట్ టాపిక్‌గా మారింది. గురువారం వైవీ సుబ్బారెడ్డి నిర్వహించిన మీడియా సమావేశానికి పరిమిత సంఖ్యలో మీడియా ప్రతినిధులనే ఆహ్వానించారు. ఈ సమావేశానికి కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులకు ఆహ్వానం వెళ్లలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సమావేశానికి హాజరైన మీడియా ప్రతినిధులకు అడగాల్సిన ప్రశ్నలు, వాటికి తాము ఇచ్చే సమాధానాలు అంటూ పత్రాలివ్వడం గమనార్హం. వైవీ సుబ్బారెడ్డి నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరైనవారికి.. అక్కడి నిర్వాహకులు ‘‘మీ రాష్ట్రం మీకు తెలుసా’’ అంటూ 12 ప్రశ్నలతో కూడిన పత్రాలను అందజేశారు. ఇందుకు సమాధానాలను వెనక పత్రంలో ఇచ్చారు. ప్రశ్నలకు జవాబులు తెలియకపోతే వెనక ఉన్న సమాధానాలను చూడాలని సూచించారు. 

ఇక, ఈ సమావేశంలో మాట్లాడిన  వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని  కోరారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పరిశ్రమలో ప్రమాదాల గురించి మీడియా ప్రతినిధుల గురించి ప్రశ్నించగా.. వాటిని పరిశీలిస్తామని చెప్పారు. అయితే మీడియా సమావేశంలో ప్రశ్నలు, సమాధానాలతో కూడిన జాబితాను ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలాఉంటే, వైవీ సుబ్బారెడ్డి బుధవారం మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులతో ఏపీ అభివృద్ధి బాటలో పయనిస్తోందని అన్నారు. తలసరి ఆదాయం, జీడీపీ పెరుగుతుందని చెప్పారు. 2021-22లో ఏపీ 11.2 శాతం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. పేదరికం స్థాయి 2016లో 11.77 శాతం ఉంటే.. 2021లో 6.7%కి తగ్గిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 తర్వాత ఎంఎస్‌ఎంఈల ద్వారా లక్షల ఉద్యోగాలను సృష్టించిందని చెప్పారు. రూ. 19,115 కోట్ల పెట్టుబడితో దాదాపు 1,52,558 ఎంఎస్‌ఎంఈలు 13 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని తెలిపారు. 

click me!