
తనను ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించాల్సిందిగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్కు ఫిర్యాదు చేయడంపై కౌంటరిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన గత వారం రోజులుగా నిమ్మగడ్డ చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని ఎద్దేవా చేశారు.
ఆయన వాడే భాష గానీ, సీనియర్ అధికారుల పట్ల దుందుడుకుగా, నియంత పోకడలో నిమ్మగడ్డ ఇస్తున్న డైరెక్షన్స్ పరిధికి దాటి వున్నాయని సజ్జల మండిపడ్డారు. ఎన్నికలు బాధ్యాయుతంగా వ్యవహరించమని, తన పరిధికి లోబడి స్వతంత్రంగా తీసుకోమని ఇచ్చిన అధికారాలను రాజులాగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
ఏ ఎన్నికల కమీషనర్ అయినా రిఫరి లాంటి వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. చిన్న సహకార ఎన్నికల నుంచి రాష్ట్ర స్థాయి ఎన్నికల వరకు ఎన్నికలకు ఓ వ్యవస్థ వుందని సజ్జల తెలిపారు.
ఆ స్థానంలో వున్న వారు వ్యక్తిగతమైన అభిప్రాయాలతో తొందరపడి నిర్ణయాలు తీసుకోరని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ఎంత కఠినంగా వ్యవహరించినా ఈసీ తీసుకున్న నిర్ణయాలను ఎవరు ప్రశ్నించలేరని ఆయన స్పష్టం చేశారు.
Also Read:సజ్జల రామకృష్ణా రెడ్డి పదవికి గండం: నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖ
టీఎన్ శేషన్ ఎన్నికల కమీషనర్గా వున్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు కూడా ఓ పరిధికి లోబడే వుందని సజ్జల గుర్తుచేశారు. ఎన్నికల కమీషనర్ ఎలా ఉండాలో ఒక ఉదాహరణగా శేషన్ నిలిచారని చెప్పారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోపాలకృష్ణ ద్వివేది చాలా ప్రశాంతంగా, సంయమనంతో వ్యవహరించారని సజ్జల గుర్తుచేశారు. నిమ్మగడ్డ అసలు ఐఏఎస్ ఎలా చదివారో, అన్ని రోజులు సర్వీస్లో ఎలా వున్నారో అర్థం కావడం లేదంటూ చురకలంటించారు.
మార్చి 15, 2019లో బట్టలిప్పేసిన వ్యక్తి అప్పటి నుంచి విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. రమేశ్ కుమార్ గీత కాదు అన్ని దాటేశారంటూ సెటైర్లు వేశారు. మార్చి 18న కేంద్రానికి రాసిన లేఖతోనే నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అర్థమైందని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ ఎన్నికలకు వ్యతిరేకంగా కాదని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు వ్యవస్థల్లో తన మనుషులను దూర్చి ఎలాగైతే మేనేజ్ చేస్తున్నారో అందరికీ తెలుసునని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా నిమ్మగడ్డ ఆ పార్టీకి ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని సజ్జల ఆరోపించారు.