న్యాయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. కేవలం తమకు అవసరమైన అంశాలనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ మూడు రాజధానులకు (ap 3 capitals) సంబంధించి వైసీపీ (ysrcp) నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (modugula venugopala reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కేవలం తమకు అవసరమైన అంశాలనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందంటూ వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థలలో ఎవరు గొప్పా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్దాయి లో చర్చ జరగాలని.. న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా అంటూ మోదుగుల ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలగేలా చేయాలని.. అంబేద్కర్ రాజ్యంగాన్ని అవమాన పరుస్తారా అంటూ మాజీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన (ap bifurcation) ఎలా జరిగిందో దేశ ప్రజలకు తెలుసునని.. కాంగ్రెస్ పార్టీ రాష్టాన్ని నాశనం చేసిందని, అందులో బిజేపి పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజనపై వేసిన పిటిషన్లపై ఎందుకు వాదనలు జరగడం లేదని మోదుగుల ప్రశ్నించారు. అసెంబ్లీ లో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంటీ అని ఆయన నిలదీశారు. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని.. ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టు లో పిటిషన్ వేశామని మోదుగుల గుర్తుచేశారు. 2019 లో వేసిన పిటిషన్ ను కోర్టు ఎందుకు పట్టించుకోవడం లేదని వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ముందు రాష్ట్ర విభజన పిటిషన్ లపై తీర్పు లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇకపోతే.. మూడు రాజధానులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్కు గురువారం హైకోర్టులో (ap high court) గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం ప్రకారమే వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం (crda act) ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని.. 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది.
అభివృద్ది పనులపై హైకోర్టుకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని పేర్కొంది. రాజధాని అవసరాలకే భూమిని వినియోగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమిని వినియోగించడానికి వీల్లేదని తెలిపింది. రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కొందరు న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని తెలిపింది. మాస్టర్ ప్లాన్ ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించాలని చెప్పింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషన్ల ఖర్చు కోసం రూ. 50 వేలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.