
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణం అందరినీ కలచివేసింది. కాగా... ఆయన బాధ్యతలను ఇతర మంత్రులకు అప్పగించడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి పబ్లిక్ ఎంటర్ప్రైజేస్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.
కాగా.. గత వారం గౌతమ్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే వైద్యులు గౌతమ్రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9:16 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గౌతమ్ రెడ్డి ఆస్పత్రికి తరలించే ముందు ఏం జరిగిందనే దానిని ఆయన ఇంట్లో పనిచేసేవాళ్లు మాట్లాడుతూ.. ‘దుబాయ్ నుంచి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఉదయం లేచిన తర్వాత టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం చేశారు. రాత్రి ఏదో ఫంక్షన్ వెళ్లి వచ్చారు. రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకుని నిద్రపోయారు. ఈ రోజు ఉదయం 7.15 ఇంట్లో సోఫాలో పడిపోయి ఉన్నాడు. వెంటనే బయటకు తీసుకుని వచ్చాం. డ్రైవర్ వెంటనే ఆస్పత్రికి తరలించారు’ అని చెప్పారు.
చనిపోవడానికి వారం ముందు మొత్తం దుబాయ్ ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న అనంతరం ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం పరంగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించే గౌతమ్ రెడ్డి ఇలా హఠాన్మరణం చెందడం పలువురిని షాక్కు గురిచేసింది.