నెల్లూరు రూరల్‌పై వైసీపీ ఫోకస్.. ఇంచార్జ్‌గా పరిశీలనలో ఇద్దరి పేర్లు!.. మరోసారి జగన్‌తో భేటికానున్న బాలినేని..

By Sumanth KanukulaFirst Published Feb 2, 2023, 10:42 AM IST
Highlights

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అధికార వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. 

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అధికార వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తాను వైసీపీలో ఉండలేనని ప్రకటించిన కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి.. తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ  నుంచి పోటీ  చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. అలాగే తన ఫోన్‌ను ట్యాంపింగ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో పరిణామాలపై వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే సీఎం జగన్‌తో మజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా పరిణామాలను సీఎం జగన్‌కు వివరించారు. 

కోటంరెడ్డి పార్టీలో ఉండలేనని ప్రకటించిన నేపథ్యంలో.. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్‌ను నియమించడంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఆనం విజయ్‌కుమార్ రెడ్డి, అదాల ప్రభాకర్‌రెడ్డి‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారితో  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి చర్చలు జరుపనున్నట్టుగా సమాచారం. 

అయితే తాజాగా గురువారం సీఎం జగన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మరోసారి సమావేశం కానున్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జ్ ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాంపింగ్ అంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. అది రికార్డింగేనని తాను నిరూపిస్తానని.. లేకుంటే తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటామని అన్నారు. కోటంరెడ్డి మిత్రుడితోనే ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు.. రికార్డింగ్‌ అని నిరూపిస్తామన్నారు. ఇక,  కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు అధికార పార్టీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాడేపల్లికి పిలిచిన సీఎం జగన్.. ఆయనతో మాట్లాడారు. దీంతో అంతా సర్దుకుందని భావించారు. అయితే తాజాగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కోటంరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను టీడీపీలో చేరనున్నట్టుగా ప్రకటించారు. 

click me!