విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష జరిపారు. ఎల్జీ పాలిమర్స్ వంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని ఆయన ఆదేశించారు.
అమరావతి: గ్యాస్ లీక్ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షక్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్చంద్, పోలీస్ కమిషనర్ ఆర్ కే మీనా పాల్గొన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని నీలం సాహ్ని చెప్పారు.
ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ నివారణకు చేపట్టిన చర్యలను ఆమె సీఎంకు వివరించారు. ట్యాంకర్లోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్ అయ్యిందని, మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్ అవుతుందని కలెక్టర్ చెప్పారు. దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారని తెలిపారు. ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయని, విశాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్, పీసీబీ మెంబర్సెక్రటరీ వివేక్ యాదవ్ వస్తున్నారని చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని వైఎస్ జగన్ ఆదేశించారు.
కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా ఉండాలని ఆనయ సూచించారు. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటిని నివారణకు పాటించాల్సిన ప్రమాణాల ఆపరేషన్ ప్రొసీజర్ను సిద్ధంచేయాలని ఆయన ఆదేశించారు. విశాఖపట్నంలో ఇలాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని జగన్ ఆదేశించారు :
అందులో జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలను గుర్తించాలని కూడా చెప్పారు.
మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టిపెట్టాలని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటి తరలింపుపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయాలని జగన్ ఆదేశించారు. జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది రాకుండా జనావాసాలకు దూరంగా తరలించడానికి తగిన ఆలోచనలు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
అలాగే ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదా ఉన్న ముడిపదార్థాలను పూర్తిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాల్సిన మార్గాలపైకూడా ఇంజినీర్లతో మాట్లాడాలని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలేసి విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.