
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెళ్లయిన యువతులకు గుడ్ న్యూస్ చెప్పింది అక్కడ సర్కార్. నిరుపేద యువతుల వివాహాలకు అందించే సహకారాన్ని.. నేడు వారి తల్లుల ఖాతాల్లో వేయనుంది. వైయస్సార్ షాదీ తోఫా, వైయస్సార్ కళ్యాణమస్తు నిధులను నేడు అందించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం వైఎస్సార్ కళ్యాణమస్తు... ముస్లిం మైనారిటీల కోసం వైయస్సార్ షాదీ తోఫాను నిరుపేద యువతుల వివాహ కానుకగా అందిస్తుంది వైసిపి ప్రభుత్వం.
ఇందులో భాగంగానే 2023, అక్టోబర్- డిసెంబర్ లో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు మంగళవారం నాడు విడుదల చేస్తున్నారు. 10,132 జంటలకు గాను యువతుల తల్లుల ఖాతాల్లో రూ. 78.53 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నారు. మంగళవారం నాడు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లోకి సొమ్మును జమ చేస్తారు. ఈ పథకాల ద్వారా నిరుపేదల కుటుంబాలకు అండగా నిలుస్తుంది. బాల్య వివాహాలకు చెక్ పెడుతోంది ప్రభుత్వం. ఈ పథకం కింద నగదు అందాలంటే.. వధువు వయసు కచ్చితంగా 18 ఏళ్లు ఉండాల్సిందే. వరుడు వయసు 21 సంవత్సరాలు నిండాలి. దీంతోపాటు వధువు, వరుడు ఇద్దరు తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలి. వారి కుటుంబంలో ఎవ్వరూ కూడా ఆదాయపన్ను చెల్లింపు దారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు.
ఈ నిబంధనలకు లోబడిన కుటుంబాల యువతులకి షాదీ తోఫా, కళ్యాణమస్తు కింద ఎస్సీఎస్టీ వధూవరులకు లక్ష రూపాయలు, బీసీలకు 50 వేల రూపాయలు, మైనారిటీలకు లక్ష రూపాయలు అందిస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీ ఎస్టీలకు రూ. 1,20,000, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75వేల రూపాయలు, ఈ పథకం కిందికి వచ్చే దివ్యాంగులకు రూ.1.50వేలు వైసిపి ప్రభుత్వం అందిస్తుంది.