అమ్మా...నేను ఫెయిల్యూర్ గా మిగిలిపోయా: బిటెక్ విద్యార్థి ఆత్మహత్య లైవ్ వీడియో

By Arun Kumar PFirst Published Jan 6, 2021, 9:30 AM IST
Highlights

బీటెక్ విద్యార్థి బలవన్మరణంతో  కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో విషాదం నెలకొంది. 

"అమ్మా...నేను ఫెయిల్యూర్​గా మిగిలిపోయా. చదువులో ముందుకు వెళ్లలేకపోతున్నానమ్మా.మీరు కష్టపడి పెంచిన ఈ జీవితానికి ఇక సెలవమ్మా" అంటూ ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది.

బీటెక్ విద్యార్థి బలవన్మరణంతో  కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూమారుడు మృతి చెందటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతులకు తిరుమలేశ్ ఒక్కగానొక్క కుమారుడు. తమ కుమారుడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని భావించిన తల్లిదండ్రులు అతడిపి ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్పించారు. బీటెక్ చివరి ఏడాది చదువుతున్న తిరుమలేశ్.. కొవిడ్ కారణంగా ఇన్నాళ్లు ఇంటి వద్దే ఉండి.. నాలుగు రోజుల క్రితం కళాశాలకు వెళ్లాడు. ఏమైందో తెలీదు కానీ ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

 "ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేక పోతున్నా..మీ ఆశల్ని నెరవేర్చలేక పోతున్నందుకు బాధగా ఉంది. మిమ్మల్ని విడిచి వెళ్తున్నా. నాకు సహాయం చేసిన వారందిరికి కృతజ్ఞతలు. నన్ను క్షమించండి." అంటూ సెల్ఫీ వీడియో తీసి మిత్రులకు పంపించాడు. అనంతరం కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

వీడియో

కొన ఊపిరితో ఉన్న తిరుమలేశ్​ను విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాధను దిగమింగుకొని కుమారుడి నేత్రాలను ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. 

మంగళవారం పెనుగంచిప్రోలులో తిరుమలేశ్ అంత్యక్రియలు నిర్వహించగా..మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య హాజరై మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం యువకుడి తల్లిదండ్రులను ఓదార్చారు.

click me!