ఆదివారం సరదాగా గడపడాని బీచ్ కు వెెళ్లిన ఇద్దరు సోదరుల్లో ఒకరు సముద్రంలో మునిగిపోయిన హృదయవిధారక ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం: ఇద్దరు అన్నదమ్ములు సరదాగా గడపడానికి సముద్ర తీరానికి వెళ్లారు. బీచ్ లో వీరిద్దరు సోదరుల్లా కాకుండా స్నేహితుల్లా ఆనందంగా ఎంజాయ్ చేయడం చూసి ఆ సముద్రుడికి కూడా కన్నుకుట్టినట్లుంది. సరదాగా నీటిలోకి దిగిన వీరిద్దరిలో ఒకరిని రాకాసి అలలు మింగేసాయి. ఈ హృదయవిధారక ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లాలోని దుప్తురు గ్రామానికి చెందిన శ్యామ్(16) తన అన్నయ్యతో కలిసి ఆదివారం సరదాగా గడపడానికి పూడిమడక సీతాపాలెం బీచ్కు వెళ్లాడు. ఈ క్రమంలోనే అన్నదమ్ములిద్దరూ సరదాగా నీటిలోకి దిగారు. అయితే శ్యామ్ నీటిలో ఆడుకుంటూ చాలా లోతులోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వచ్చిన అలలు శ్యామ్ ను సముద్రంలోకి లాక్కెల్లాయి. అతడి సోదరుడు రక్షించే ప్రయత్నం చేసినా కుదరలేదు.
వీడియో
రాకాసి అలలు తమ్మున్ని సముద్రంలోకి లాక్కెలుతున్నా చూస్తూ వుండిపోవడం తప్ప కాపాడలేని నిస్సహాయ స్థితిలో అన్నయ్య ఉండిపోయాడు. అతడి కళ్ళముందే తమ్ముడు కేకలు వేస్తూ సముద్రంలో మునిగిపోయాడు.
read more మద్యానికి బానిసగా మారి.. భార్య, కూతురి ఒంటికి నిప్పు పెట్టి..
తన సోదరుడు సముద్రంలో గల్లంతయ్యాడు కాపాడమంటూ యువకుడు గ్రామస్తులను వేడుకున్నాడు. దీంతో వారు సముద్రంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. అలల తాకిడికి శ్యామ్ చాలా దూరం సముద్రంలోకి కొట్టుకుపోయి వుంటాడని భావించి గజ ఈతగాళ్లు, జాలర్ల సాయంతో గాలింపు చేపట్టారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సముద్రం వద్దకు వచ్చి కొడుకును తలచుకుని బోరున విలపిస్తున్నారు. చేతికందివచ్చిన కొడుకు సముద్రంలో మునిగిపోవడాన్ని వారు భరించలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి.