
నంద్యాల్లో ప్రచారం గడువు ముగిసినా, నిబంధనలు అమలులో ఉన్నా, ఈసీ ఆదేశాలను పట్టించుకోకుండా సర్వే వివరాలు ప్రసారం చేసిన ఓ ప్రవేట్ చానల్పై చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపి నేతలు. మంగళవారం హైదరాబాద్ లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఓ ఛానేల్ పైన, ఆదేశాలను ఉల్లంఘించిన టీడీపీ నాయకుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గడువు ముగిసినా మంత్రులు, టీడీపీ నాయకులు నంద్యాలలోనే ఉన్నారని వైసీపి నేతలు నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కె.శివకుమార్, చల్లా మధుసూదన్ రెడ్డి.. ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ను కలిసి ఈ మేరకు విజ్ఞాపనపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రచార గడువు ముగిసినా మంత్రులు, స్థానికేతర టీడీపీ నాయకులు ఇంకా నంద్యాలలో తిష్ట వేశారని ఆరోపించారు. స్థానికేతర నేతలను తక్షణమే అక్కడి నుంచి పంపించాలని ఎన్నికల అధికారిని కోరినట్టు తెలిపారు. ముక్కుపుడకలు, చీరలు, మద్యం కూడా విచ్చలవిడిగా పంచుతున్నారని వెల్లడించారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని భన్వర్లాల్కు విజ్ఞప్తి చేసినట్టు శ్రీకాంత్ తెలిపారు.
మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి