జనసేనాని పవన్ కల్యాణ్ ది దొంగ ఓటే ..: వైసిపి సంచలనం  

By Arun Kumar PFirst Published Jan 10, 2024, 9:10 AM IST
Highlights

విజయవాడ నుండి మంగళగిరికి తన ఓటును మార్చుకున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. అయితే జనసేన పార్టీ కార్యాలయం అడ్రస్ తో ఓటుహక్కు పొందడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య బోగస్ ఓట్ల వివాదం రాజుకుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసిపి దొంగ ఓట్లను సృష్టించిందని ... తద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. వైసిపి మాత్రం బోగస్ ఓట్ల ఆరోపణలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అంటోంది.

తాజాగా బోగస్ ఓట్ల వ్యవహారంపై ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి అధికార, ప్రతిపక్షాలు ఫిర్యాదుచేసాయి. అయితే బోగస్ ఓట్లపై సిఈసి కి ఫిర్యాదుచేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్వయంగా దొంగ ఓటు కలిగివున్నాడన్న ఆరోపణలు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 

Latest Videos

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయ అడ్రస్ తో పవన్ కల్యాణ్ ఓటుహక్కును కలిగివున్నాడు... ఇది నిబంధనలకు విరుద్దమని వైసిపి ఆరోపిస్తోంది. నివాసముండే ఇంటి చిరునామాతో మాత్రమే ఓటుహక్కు నమోదు చేసుకోవాలి... కానీ పవన్ రాజకీయ పార్టీ ఆఫీస్ అడ్రస్ తో ఓటుహక్కును పొందాడని అంటున్నారు. కాబట్టి పవన్ కల్యాణ్ ది దొంగ ఓటు కిందకే వస్తుందని వైసిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. 

Also Read  బోగస్ ఓట్లపై టీడీపీ తప్పుడు ఫిర్యాదు: చర్యలు తీసుకోవాలని కోరామన్న విజయసాయి రెడ్డి

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటుహక్కును కలిగివున్న పవన్ ఇటీవల మంగళగిరికి మార్చుకున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. మంగళగిరిలో పవన్ కు నివాసం లేకపోవడంతో పార్టీ కార్యాలయం అడ్రస్ తో ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో ఇది నిబంధనలకు విరుద్దమని ఆరోపించడమే కాదు పవన్ పొలిటికల్ టూరిస్ట్ అని మరోసారి రుజువయ్యిందని వైసిపి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. 

ఇక మరో మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ఆంధ్ర ప్రదేశ్ లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడంపైనా వైసిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబసమేతంగా వెళ్లి ఓటేసిన నాగబాబు ఇప్పుడు ఏపీలో ఓటేసేందుకు సిద్దమవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఎన్నికలు ముగియగానే మళ్ళీ తెలంగాణలో ఓటుహక్కు కావాలంటారేమో అంటూ వైసిపి నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే రాష్ట్రంలో ఓటుహక్కు కలిగివుండాలి... కాబట్టి ఇప్పటికే తెలంగాణలో ఓటేసిన నాగబాబుకు ఏపీలో ఓటుహక్కు కల్పించవద్దని వైసిపి నాయకులు ఈసీని కోరారు. 

హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో నాగబాబుతో పాటు ఆయన సతీమణి పద్మజ, వరుణ్ తేజ్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఓటేసేందుకు నాగబాబు సిద్దమయ్యారట... ఇందుకోసం తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరంలోని ఓ ఇంటి అడ్రస్ తో ఓటు పొందేందుకు ప్రయత్నించారట. దీంతో బోగస్ ఓట్లంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న జనసేనకు నాగబాబు వ్యవహారంపై విమర్శలు సంధించింది వైసిపి. 

click me!