వైసీపీ ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించలేదని టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్రంగా మండిపడ్డారు. సినీ పెద్దలు తనను చర్చలకు పిలువలేదనే బాధ బాలకృష్ణలో కనిపిస్తోందని ఆయన అన్నారు.
అనంతపురం: తమ పార్టీ ప్రభుత్వం మనుగడపై నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్రంగా మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగబోదని బాలకృష్ణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
బాలకృష్ణకు కౌంటర్ ఇస్తూ ఇక్బాల్ ఓ వీడియోను విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వం పడిపోతుందని బాలకృష్ణ ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం బాలకృష్ణకు తెలియదా అని అడిగారు. తాము గేట్లు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో చెప్పారని ఆయన గుర్తు చేశారు.
Also Read: జగన్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు, మేం వస్తాం: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
విలువలకు కట్టుబడి వైఎస్ జగన్ పాలన సాగుతోందని ఆయన అన్నారు. తన మానసిక స్థితిని బాలకృష్ణ చెక్ చేయించుకోవాలని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ తనను చర్చలకు పిలువలేదనే బాధ బాలకృష్ణలో కనిపిస్తోందని ఆయన అన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్వహించింది మహానాడా లేక జూమ్ నాడా అని అడిగారు. హిందూపురం ప్రజలను బాలకృష్ణ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లు మనుగడ సాగించలేదని, ఈలోగా తాము అధికారంలోకి వస్తామని బాలకృష్ణ గురువారం మహానాడు ప్రసంగంలో వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సినీ పెద్దలు జరిపిన చర్చలకు తనను పిలువకపోవడంపై కూడా బాలకృష్ణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read: కేసీఆర్తో సినీ చర్చలపై బాలకృష్ణ అసంతృప్తి: చిరంజీవి వ్యూహం ఇదే!