వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యానిది హత్యే: పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక

By narsimha lodeFirst Published May 22, 2022, 11:14 AM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అలియాస్ ఉదయ్ భాస్కర్ వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసిన సుబ్రమణ్యానిది హత్యేనని పోస్టుమార్టం నివేదిక తేల్చింది.


కాకినాడ: YCP  ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అలియాస్ Anantha Babu వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసిన  Subramanyamది హత్యేనని Postmortem నివేదిక తేల్చింది. సుబ్రమణ్యాన్ని కొట్టడంతోనే అతను మరణించినట్టుగా ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు.  తీవ్రంగా కొట్టడం వల్లే సుబ్రమణ్యం అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కూడా ఈ నివేదిక తెలుపుతుంది. 

కాకినాడ బీచ్ లో సుబ్రమణ్యాన్ని కొట్టి చంపినట్టుగా అనుమానిస్తున్నారు. మృతుడి ఒంటిపై బీచ్ లో మట్టి, ఇసుక, ఒంటిపై కాళ్లతో తన్నిన గుర్తులున్నాయని పోస్టుమార్టం నివేదికలో గుర్తించారు. మృతుడి తల మీద ఎడమ వైపున గాయాన్ని కూడా పోస్టుమార్టం చేసిన వైద్యులు గుర్తించారు.
ఎడమ చేయిపై కూడా గాయాలను గుర్తించారు.పై పెదవి మీద గాయాల విషయాలను కూనడా వైద్యులు ప్రాథమిక నివేదికలో పొందుపర్చారు.ఎడమ కాలు బొటనవేలిపై కూడా గాయాలను గుర్తించారు. కుడికాలుపై కూడా గాయాలున్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ అనంతబాబు కు వివాహేతర సంబంధాలు బయట పడతాయనే ఉద్దేశ్యంతోనే సుబ్రమణ్యాన్ని హత్య చేశారని మృతుడి భార్య ఆరోపిస్తున్నారు.

శుక్రవారం నాడు తెల్లవారుజామున సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మరణించాడని ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత కారులో డెడ్ బాడీని తీసుకు వచ్చి మృతుడి కుటుంబ సభ్యులు నివాసం ఉండే అపార్ట్ మెంట్ వద్ద వదిలి వెళ్లిపోయాడు.

also read:సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: కేసులో ప్రధాన నిందితుడిగా వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్

దీంతో తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి.కాకినాడ ప్రభుత్వాసుపత్రి వద్ద సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత ఆందోళనను విరమించాడు కుటుంబ సభ్యులు.  దీంతో శనివారం నాడు రాత్రి సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు.  పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఆదివారం నాడు ఉదయం తూర్పు గోదావరి జిల్లాలోని గొల్ల మామిడాలలో సుబ్రమణ్యం అంత్యక్రియలు పూర్తి  చేశారు.

ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబును అరెస్ట్ చేయాలని రెండు రోజుల పాటు సుబ్రమణ్యం భార్య  24 గంటలకు పైగా ఆందోళన చేసింది. పోస్టుమార్టం గది వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు.  ఆదివారం నాడు తెల్లవారుజాము రెండు గంటలకు సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. సుబ్రమణ్యం గొంతుపై బలంగా నొక్కినట్టుగా కూడా పోస్టుమార్టం నిర్వహించిన పోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోస్టుమార్టం పూర్తిస్థాయి నివేదిక ఇంకా రావాల్సి ఉంది.

తొలుత ఈ కేసును అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ఈ కేసును హత్య కేసుగా మార్చారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు పోలీసులకు పట్టుబడితే ఈ కేసు విషయమై మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 

ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. మరో వైపు  సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను తాము కొట్టలేదని కూడా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై తమ శాఖపై తప్పుడు ప్రచారం సాగుతుందన్నారు.  ఈ కేసు విషయమై తాము చట్ట ప్రకారంగా వ్యవహరిస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు.

మరో వైపు సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలోనే మరణించాడని ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబు శనివారం నాడు మీడియాకు ప్రకటనను విడుదల చేశారు. అయితే ఎమ్మెల్సీని పోలీసులు అదుపులోకి తీసుకోకుండా మీన మేషాలు లెక్కించడంతో ఆయన తప్పించుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 

click me!