వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వైసీపీ నేతల వల్ల తన కుటుంబం పరువుపోయిందని అన్నారు. ప్రతి పనికి లంచాలు అడుగుతున్నారని మండిపడ్డారు.
అమరావతి: కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అయ్యారు. కొందరు వైసీపీ నేతల వల్ల తన కుటుంబం పరువుపోయిందని ఆగ్రహించారు. ఇటీవలే జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో నల్లపురెడ్డి సొంత మండలంలో వైసీపీ స్థానాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ నేతలపై సీరియస్ అయ్యారు. కోట పంచాయతీలో ఏ పని జరగాలన్నా వైసీపీ నేతలు లంచాలు అడుగుతున్నారని, లంచాలు లేనిదే ఏ పనీ చేయడం లేదని ఆగ్రహించారు. ఓపెనింగ్ కార్యక్రమాలకు పిలిచినా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కొందరు వైసీపీ నేతల వల్ల తన కుటుంబం పరువు పోయిందని చెప్పారు.
సొంత మనుషులు ఇతర పార్టీలోకి వెళ్లిపోవడం బాధాకరంగా ఉన్నదని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కంచుకోటగా ఏర్పాటు చేసిన తన మండలం, తన ఊరిలో తమ ఉనికి కోల్పోవడం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందారు. లంచాలు అడిగేవారిని ఉపేక్షించబోరని అన్నారు. అవసరమైతే వారిని పార్టీ బయటికి వెళ్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.