పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసినందుకే... నాపై అట్రాసిటీ కేసు: యనమల ఆగ్రహం

By Arun Kumar PFirst Published Jun 29, 2021, 3:54 PM IST
Highlights

కరోనా విజృంభణ సమయంలో ముఖ్యమంత్రి జగన్ పారాసిటమాల్, బ్లీచింగ్ అంటూ ఎగతాళి చేశారని మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. 

ప్రజా సమస్యలపై మాట్లాడితే కేసు పెట్టడం ఏపీలోనే ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కక్ష గట్టి కేసులు పెడుతున్నారని... పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసినందుకు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని యనమల పేర్కొన్నారు. 

''ప్రభుత్వం తెలిసి చేస్తున్న తప్పులతో పేదలు నలిగిపోతున్నారు. కరోనా విజృంభణ సమయంలో పారాసిటమాల్, బ్లీచింగ్ అంటూ ఎగతాళి చేశారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కు తెరలేపారు'' అని యనమల ఆరోపించారు.

''సూచనలను స్వీకరించలేని పిచ్చి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే ఉన్నాడు. ప్రజలిచ్చిన అధికారమని మరిచి.. ఇడుపులపాయ నుండి తెచ్చుకున్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దోపిడీ తీవ్రతరం చేశారు. పేదలకు మందులు కూడా ఉచితంగా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో వుంది'' అని యనమల మండిపడ్డారు.

read more  ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని ముంచాడు: చంద్రబాబు

మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... జగన్ రెడ్డి చేస్తున్న ఘనకార్యాలకు మనం రోజూ దీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలపై ధరలు, పన్నుల భారం మోపారని... ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలు బలవుతున్నారన్నారు. 

''వైసీపీ నేతలు మందులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఉచితంగా అందించాల్సిన ఆనందయ్య మందునూ అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ అరాచక విధానాలను ప్రశ్నించినందుకు నాపై అక్రమ కేసు పెట్టారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి'' అని సోమిరెడ్డి హెచ్చరించారు. 
 

click me!