ముద్రగడ-పవన్ ఏకమవుతారా?

First Published Jan 20, 2018, 2:09 PM IST
Highlights
  • వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయా?

వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది. పరిణామాలు సానుకూలమైతే వచ్చే ఎన్నికల ఫలితాలు విచిత్రంగా ఉంటాయనటంలో సందేహం లేదు.  పెను సంచలనాలు కలిగించేంత పరిణామాలు ఏమి జరిగాయని ఆలోచిస్తున్నారా?

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రతినిధులు కాపుఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వద్దకు రాయబారం వచ్చారు. పవన్ ప్రతినిధులకు, ముద్రగడకు మధ్య సుమారు గంటపాటు చర్చలు జరిగాయి. ఇంతకాలం ముద్రగడ-పవన్ మధ్య పెద్దగా చర్చలు కానీ రాయబారాలు కానీ లేవనే చెప్పాలి. అటువంటిది హటాత్తుగా జనసేన ప్రతినిధిగా పవన్ తన మేనమామ మారిశెట్టి రాఘవయ్యను పంపటమే విశేషం.

రాయబారానికి పంపటానికి నేపధ్యం కూడా ఉందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే, పవన్-కత్తి మహేష్ మధ్య నడుస్తున్న వివాదం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కత్తిపై పవన్ అభిమానులు దాడి చేశారు. దాంతో రెండు రాష్ట్రాల్లోనూ కత్తికి మద్దతుగా కొన్ని సామాజికవర్గాలు ఏకమైపోయాయి. పవన్ కటౌట్లు, బ్యానర్లను చించేశారు. అంతేకాకుండా ఏకంగా పవన్ కే వార్నింగులు కూడా ఇచ్చారు.

ఇక్కడే పవన్ లో ఆలోచన మొదలైంట. తనకు వ్యతిరేకంగా సామాజికవర్గాలు ఏకమవుతున్న విషయాన్ని పవన్ గమనించారట. కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా తన సామాజికవర్గం మద్దతును తీసుకోవటం అనివార్యమని భావించారట. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా కాపు సామాజికవర్గం మద్దతు కూడగట్టుకోవటం పవన్ కు తప్పదు. అందుకనే ముందుగానే మేల్కొన్న పవన్ వెంటనే ముద్రగడతో రాయబారానికి తన మేనమామను పంపారట.

వీరిద్దరి తరపున ఇదే తొలి భేటి అనే చెప్పవచ్చు. గతంలో కూడా రాఘవ, ముద్రగడలు కలిసినా అది పూర్తిగా వ్యక్తిగతమే. అధికారికంగా జరిగిన తొలి సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. రెండో సమావేశం వచ్చే ఫిబ్రవరిలో ఉండొచ్చంటున్నారు. బహుశా అప్పుడు పవన్-ముద్రగడే నేరుగా కూర్చునే అవకాశాలున్నాయి.

వీరి భేటీ గనుక సానుకూలమైతే జనసేన పార్టీ క్రిందే ఇద్దరు ఏకమై వచ్చే ఎన్నికలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అయితే, జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? లేకపోతే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా అన్నది తేలలేదు. ఎందుకంటే, కాపులకు రిజర్వేషన్ అమలు చేయటం కోసం చంద్రబాబుకు ముద్రగడ మార్చి నెలను డెడ్ లైన్ పెట్టారు. దాన్నిబట్టి పొత్తులా? ఒంటరి పోటీనా అన్నది తేలుతుంది.  

 

click me!