నడుస్తున్న రైలు నుండి పిల్లలతో దూకిన తల్లి, ఇద్దరు మృతి, మరోకరు క్షేమం

First Published Jun 7, 2018, 10:32 AM IST
Highlights

పిల్లల చదువుల కోసం ఆ తల్లి ఏం చేసిందంటే?

విశాఖపట్టణం: పిల్లలను కార్పోరేట్ స్కూల్లో  చదివించాలనే కోరిక  ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నడుస్తున్న రైల్లో నుండి పిల్లలతో కలిసి తల్లి దూకింది. ఈ ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందగా, కూతురు తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ట్రాక్టర్  డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చంద్రశేఖర్ భార్య  ఇందుమతి  టైలరింగ్  దుకాణంలో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు. జోత్స్న, బద్రీనాథ్. జీవనోపాధి కోసం ఈ దంపతులు విశాఖ జిల్లాకు వలస వచ్చారు.  అక్కడే చంద్రశేఖర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 


పిల్లలను కార్పోరేట్ స్కూల్లో చదివించాలని ఆమె తన భర్తతో చెబుతోండేది. అయితే కార్పోరేట్ స్కూల్లో చదివించేందుకు  అవసరమైన డబ్బలు లేవని భర్త  ఇందుమతితో చంద్రశేఖర్ వాదించేవాడు. ఈ విషయమై భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే ప్రైవేట్ స్కూల్లో  చేర్పించేందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలను ఇందుమతి ఇచ్చింది.ఈ విషయం తెలిసిన భర్త చంద్రశేఖర్ భార్యతో మంగళవారం నాడు గొడవకు దిగాడు. 

   దీంతో భర్త తన మాట వినడం లేదని భావించిన భార్య ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. బుధవారం నాడు ఉదయమే పిల్లలను తీసుకొని  విశాఖ వెళ్ళే రైలును దువ్వాద వద్ద ఎక్కింది. రైలు గోపాలపట్నం వద్దకు రాగానే ఇద్దరు పిల్లలతో కలిసి కిందకు దూకింది. ఈ ఘటనలో ఇందుమతి ఆమె కుమారుడు అక్కడికక్కడే మరణించాడు. జోత్స్న తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతుంది.

click me!