
ఖమ్మం : ఖమ్మం జిల్లా వైరాలో ఓ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ భర్త చనిపోయాడు. ఆ విషయం అర్థం చేసుకోకుండా ఆమె.. ఆ మృతదేహంతో కలిసి నాలుగు రోజులుగా అదే ఇంట్లో ఉంటుంది. నాలుగు రోజులు కావడంతో చనిపోయి మంచంపై మృతదేహంగా ఉన్న.. భర్త శరీరం ఉబ్బి.. దుర్వాసన వస్తున్నా కూడా ఆమెకు తెలియలేదు. ఆదివారం నాడు ఆమె కుమారుడు ఇంటికి రావడంతో.. భర్త చనిపోయిన విషయం వెలుగు చూసింది. ఆ మహిళకు మతిస్థిమితం లేదని తెలుస్తోంది.
ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు బంధువులు, ఈ మేరకు వివరాలు తెలియజేశారు.. బోగి వీరభద్రం(65) రైల్వేలో గ్యాంగ్ మెన్ గా పనిచేశాడు. వైరాకు చెందిన వ్యక్తి. ఇటీవలే ఉద్యోగ విరమణ పొందాడు. వీరికి వైరాలో సొంత ఇల్లు ఉంది. భార్య పేరు మంగమ్మ. రిటైర్మెంట్ తర్వాత ఇద్దరు కలిసి అదే ఇంట్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.
వీరిలో ఒక కొడుకు, కూతురు హైదరాబాదులో ఉంటున్నారు. మరో కొడుకు వెంకటకృష్ణ ఖమ్మంలో ఉంటున్నాడు. కాగా, ఇటీవల వీరభద్రం అనారోగ్యం పాలయ్యారు. మంగమ్మకు మతిస్థిమితం సరిగా ఉండదు. ఖమ్మంలో ఉంటున్న వెంకటకృష్ణ నాలుగు రోజుల క్రితం ఇంటికి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడాడు. ఆరోజు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత రోజు నుంచి ఫోన్ చేస్తున్నా.. తల్లి ఫోన్లో మాట్లాడేది. ఏదో ఒకటి మాట్లాడి ఫోన్ పెట్టేసేది కానీ తండ్రి మాట్లాడలేదు.
ఆదివారం నాడు సెలవు కావడంతో వెంకటకృష్ణ తల్లిదండ్రులను చూసి వెళ్దామని ఊరికి వచ్చాడు. ఇంట్లోని దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఇంట్లో మంచం మీద తండ్రి మృతదేహం ఉబ్బిపోయి దుర్గంధం వేస్తుంది. అయినా కూడా తల్లి అదేమీ పట్టనట్లుగా తన పని తాను చేసుకుపోతోంది. దీంతో వెంకటకృష్ణ వెంటనే కొనిజర్ల పోలీసులకు దీని మీద సమాచారం అందించాడు. అనారోగ్య సమస్యలతోనే తండ్రి చనిపోయి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ శంకర్రావు దర్యాప్తు ప్రారంభించారు.