చికిత్సకు నిరాకరించిన నంద్యాల వైద్యులు: ఇంటికి వెళ్లిన మహిళ మృతి

By telugu teamFirst Published May 2, 2020, 11:21 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో వెళ్లి మహిళకు నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు చికిత్సకు నిరాకరించారు. దాంతో ఆమె ఇంటికి వెళ్లి మరణించింది.

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వైద్యులు చికిత్సకు నిరాకరించడంతో మహిళ మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో మహిళను బంధువులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్లారు.

రెడ్ జోన్ లో ఉన్నవారికి చికిత్స చేయబోమని వైద్యులు చెప్పడంతో వారు తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే మహిళ మరణించింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మరణించిందని ఆరోపిస్తూ బంధువులు నంద్యాల ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
 
కర్నూలు జిల్లాలో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగిగా పని చేస్తున్న రాజస్థాన్ కి చెందిన ఓ వ్యక్తి కర్నూలుకు కరోనాను పరిచయం చేశాడు. స్వగ్రామానికి వెళ్లి వస్తూ తబ్లిగీ జమాత్ కి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న వారితో కలిసి ప్రయాణం చేయడమే అందుకు కారణంగా గుర్తించారు. ఈ కేసు మార్చ్ 27వ తేదీ గుర్తించినా, మరుసటి రోజు అధికారికంగా ప్రకటించారు. అప్పటికే తబ్లిగీ జామాత్ వ్యవహారం దేశ వ్యాప్తంగా గుప్పుమంది. 

ప్రభుత్వ లెక్కల ప్రకారం కర్నూలు జిల్లా నుంచి 400 మంది జమాత్ కి వెళ్లి వచ్చారు. అయితే తొలి కేసు నమోదయిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలకు పూనుకోలేదు. తబ్లిగీల వ్యవహారంలో ఆచితూచి ముందడుగు వేసింది అన్నది విపక్షాల ఆరోపణ.తొలి పాజిటివ్ వచ్చిన వ్యక్తి మార్చ్ 14వ తేదీన వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. 

అయితే మరో రెండు రోజులు గడిచే సరికి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 100 దాటేసింది. ఆ తర్వాత 6 రోజులకు మరో 100, మూడు రోజులకు మరో 100 కేసులు దాటి ఉగ్రరూపం దాల్చేసింది. జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, 27 మండలాల పరిధిలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి రోగం సోకుతుందో అర్ధం కాని పరిస్థితి. ప్రభుత్వ ప్రకటనలతో ప్రమాదం లేదన్న ధైర్యం ఓ వైపు. జిల్లాలో రోజు రోజుకీ వ్యాధి ముదురుతున్న వైనం మరో వైపు ప్రజలను అయోయానికి గురి చేస్తున్నాయి.

click me!