
నర్సీపట్నం : extramarital affairకి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి ఓ మహిళ murder చేయించిన ఘటన గతేడాది ఆగస్టు 7న జరిగింది. తొమ్మిది నెలల తర్వాత గోలుగొండ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన చెప్పిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... గొలుగొండ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సత్తిబాబు భార్య రామలక్ష్మికి అదే గ్రామానికి చెందిన సబ్బవరపు ఎర్రినాయుడికి మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది.
ఈ విషయం సత్తిబాబుకు తెలియడంతో తరచూ తాగి వచ్చి భార్య రామలక్ష్మితో గొడవ పడేవాడు. దీంతో సత్తిబాబును హతమార్చాలని రామలక్ష్మి, ఆమె మేనత్త సన్యాసమ్మ, రామలక్ష్మి ప్రియుడు ఎర్రి నాయుడు కలిసి కుట్ర పన్నారు. సత్తిబాబును హత్య చేస్తే రూ.50 వేలు ఇచ్చేందుకు అదే గ్రామానికి చెందిన కర్రి కృష్ణతో ఎర్రినాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సత్తిబాబుకు మద్యపానం, పేకాట అలవాటు ఉంది. గతేడాది ఆగస్టు 7న సత్తిబాబుకు ఫోన్ చేసి మాకవరపాలెం సమీపంలో పేకాట ఆడుతున్నారని ఎర్రినాయుడు, కృష్ణ నమ్మబలికారు.
ఎర్రినాయుడు, కృష్ణ ఒక బైక్ పై, సత్తిబాబు తన మోపెడ్ పై బయలుదేరారు. మార్గ మధ్యలో ఏటిగైరంపేట, పెద్దరెడ్డిపల్లిలో సత్తిబాబు తో ఫుల్ గా మద్యం తాగించారు. మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం దగ్గర్లో ఏలేరు కాలువ పక్కన తోటలోకి తీసుకువెళ్లారు. సత్తిబాబును ఎర్రి నాయుడు కింద పడేశాడు. కృష్ణ గట్టిగా పట్టుకోగా ఎర్రి నాయుడు అతని గొంతు నొక్కి చంపేసి పక్కనే ఉన్న ఏలేరు కాలువలో పడేశారు.
బండిని కూడా కాలువలో పడేశారు. సత్తిబాబు కనిపించకపోవడంతో అతడి తండ్రి దేముడు, అక్క పైడితల్లి, ఆమె భర్త రమణమూర్తి గత ఏడాది ఆగస్టు 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ సమయంలో వారు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. రామలక్ష్మి, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఎర్రి నాయుడు కలిసి సత్తిబాబును చంపేసి ఉంటారని గత నెల 19న హతుడు తండ్రి దేముడు, కుటుంబసభ్యులు గోలుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పరారీ.. లొంగుబాటు..
గోలుకొండ ఎస్సై ధనుంజయ నాయుడు, సిబ్బందితో కలిసి విచారణ చేస్తుండగా ఎర్రినాయుడు కనిపించకుండా పోయాడు. తర్వాత ఈ నెల 27న గ్రామ విఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మలను విచారించగా తామే హత్య చేశామని అంగీకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో కాలువలో గాలించగా మోపెడ్ లభించింది. సంఘటన జరిగి 9 నెలలు కావడంతో సత్తిబాబు మృతదేహం లభ్యం కాలేదు. హత్య కేసులో మరో నిందితుడు కృష్ణ ఇటీవల గంజాయి కేసులో పట్టుబడి జైలులో ఉన్నాడు. ఎర్రి నాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. కృష్ణుని కూడా అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.